స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30గంటలకి ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొంత మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.
వీరితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్, బిహార్ సీఎం నీతీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరుకానున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకు ఆహ్వానాలు పంపినా వారు హాజరుకావడం లేదని తెలుస్తోంది.
ఇక సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, బిహార్ డిప్యూటీసీఎం తేజస్వీయాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్బుల్లా హాజరుకానున్నట్టు అంచనా వేస్తున్నారు. అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరుకానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.