స్వతంత్ర వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలోకి కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లో ఉంది. భారీగా పెరుగుతున్న వరద ఉధృతితో ఇన్ ఫ్లో పెరిగింది. సామర్థ్యానికి మించి నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మరో నాలుగు గేట్లు తెరుచుకోవడం లేదు. సామర్ధ్యాన్ని మించి వరద నీరు రావడంతో కండె ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. ఏకంగా 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఇన్ ఫ్లో చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే. గేట్ల పైనుంచి నీరు వెడుతోంది.
దీంతో నిన్నటినుంచి సహాయక చర్యలు మొదలు పెట్టారు. కడెం ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే, నిన్న 12 గ్రామాలను ఖాళీ చేయించారు. కడెంలో ఐదు గ్రామాలు, దత్తులలో ఏడు గ్రామాలు ఖాళీ చేయించి వారిని పునరవాసా కేంద్రాలకు తరలించారు. అక్కడ వారిని అన్నిరకాల వసతులు, ఆహారం, నీళ్లు, పాలు ఏర్పాటు చేశామని నిర్మల్ కలెక్టర్ తెలిపారు.
ఎమ్మెల్యే రేఖ రాథోడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గేట్ల పైనుంచి నీరు వెడుతోందని తెలిపారు. ప్రస్తుతం వరద ఉధృతి కాస్త తగ్గిందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పునరవాసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఎలాంటి వదంతులు నమ్మొద్దని కోరారు. క్యాచ్ మెంట్ ఏరియాలో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు.