అమెరికా రాజకీయాల్లో జో బైడెన్ అధ్యాయం ముగిసింది. ఎనభై ఏళ్ల పై బడ్డ జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు. 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఆయనకు రన్నింగ్ మేట్గా వ్యవహరించారు. దీంతో బైడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా పదవులు స్వీకరించారు.
వాస్తవానికి 2024 ఎన్నికల్లో కూడా మొదట జో బైడెన్నే అధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ నిర్ణయించింది. కాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులిద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొనడం సర్వసాధారణం. ఎన్నికలకు ముందు జరిగే ఈ లైవ్ డిబేట్ను దేశ ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తారు. అయితే ప్రత్యక్ష చర్చలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందు జో బైడెన్ తేలిపోయారు. ట్రంప్ మహాశయుడి దూకుడు ముందు జో బైడెన్ నిలబడలేకపోయారు. అనేక అంశాలపై డొనాల్డ్ ట్రంప్ చెలరేగిపోతే, జో బైడెన్ అందుకు తగ్గట్లు బదులు ఇవ్వలేకపోయారు మొత్తంమీద లైవ్ డిబేట్లో డొనాల్డ్ ట్రంప్నకు మంచి మార్కులు పడ్డాయి. జో బైడెన్కు పాసు మార్కులు కూడా వేయలేదు అమెరికా ప్రజలు. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు వచ్చాయి. దీంతో డెమోక్రటిక్ పార్టీలో చర్చ మొదలైంది. జో బైడెన్ను అభ్యర్థిగా పెట్టుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలా లేక మరో అభ్యర్థిని బరిలోకి దించాలా అని ఆలోచనలో పడ్డారు డెమోక్రటిక్ పార్టీ నేతలు. చివరకు అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి పక్కకు తప్పుకోవాలంటూ జో బైడెన్పై స్వంత పార్టీ నేతలే ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి బరి నుంచి జో బైడెన్ వైదొలిగారు. దీంతో అప్పటివరకు ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్కు అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం దక్కింది.
జో బైడెన్కు వ్యక్తిగతంగా అమెరికా సమాజంలో గుడ్విల్ ఉంది. ఆయన నిజాయితీపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయితే కుమారుడు హంటర్ బైడెన్ నిర్వాకంతో జో బైడెన్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ మసకబారింది. ఇదే రహస్య పత్రాల కుంభకోణం. బారక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. సహజంగా అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ నాలుగేళ్ల కాలం నాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే రహస్యపత్రాలు అందుబాటులో ఉంటాయి. వీటినే అమెరికా రాజకీయ పరిభాషలో సీక్రెట్ డాక్యుమెంట్స్ అంటారు.
అయితే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీకాలం పూర్తికాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్ కు అప్పగిస్తారు. అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనిని ఒక నిబంధనగా చేశారు. రహస్య పత్రాలకు అంతటి ప్రాధాన్యం ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. అయితే అంతటి కీలకమైన రహస్య పత్రాలు ఆ తరువాతి కాలంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పాత కార్యాలయాల్లో దొరికాయి. అంతేకాదు జో బైడెన్ నివాసంలోనూ గుట్టలు గుట్టలుగా దొరికాయి. దీంతో రహస్యపత్రాల వివాదం వెలుగు చూసింది. వాస్తవానికి జో బైడెన్కు వ్యక్తిగతంగా అమెరికా నిజాయితీపరుడన్న పేరుంది. అయితే కుమారుడు హంటర్ బైడెన్ పుణ్యమా అంటూ వెలుగుచూసిన రహస్య పత్రాల వివాదంతో జో బైడెన్ నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సహజంగా అమెరికాను అగ్రరాజ్యంగా యావత్ ప్రపంచం భావిస్తుంది. ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలను అమెరికా శాసించింది అంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అవసరం లేకపోయినా ప్రపంచంపై ఆధిపత్యం కోసం నాటో కూటమిని ఏర్పాటు చేసింది అమెరికానే. ఇప్పటికీ నాటో కూటమిని వెనుకుండి నడిపిస్తోంది అమెరికానే. అయితే కాలక్రమంలో ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం తగ్గడం మొదలైంది. ఉక్రెయిన్పై సైనికదాడుల విషయంలో రష్యాను అమెరికా కట్టడి చేయలేకపోయింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చేసిన హెచ్చరికకు భయపడి అమెరికా మౌనంగా ఉన్నదన్న విమర్శలు సాక్షాత్తూ పశ్చిమ దేశాల నుంచే వచ్చాయి. ఇదంతా జో బైడెన్ అసమర్థత కారణంగానే జరిగిందన్న విమర్శలున్నాయి.
ఇదిలా ఉంటే బైడెన్కు పదవీకాలం చివరి రోజుల్లో జ్ఞాపకశక్తి తగ్గింది. మతిమరుపు కూడా బాగా పెరిగింది. దేశాధినేతల పేర్లు కూడా తప్పుగా పిలవడం మొదలెట్టారు. వివిధ దేశాధినేతలు పాల్గొన్న అనేక సదస్సుల్లో వారి పేర్లను కూడా సరిగా పలకలేకపోయారు జో బైడెన్. చివరి రోజుల్లో డెమోక్రటిక్ పార్టీలో జో బైడెన్ పట్ల వ్యతిరేకత రావడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.
నాలుగేళ్ల పాలనలో ఒక బలహీన అధ్యక్షుడిగా అమెరికా ప్రజల ముందు జో బైడెన్ ఆవిష్కృతమయ్యారు. మొత్తానికి శ్వేతసౌధంలోకి డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎంట్రీతో అమెరికా రాజకీయ చరిత్రలో జో బైడెన్ అధ్యాయం ముగిసినట్లే.