స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జనసేన కార్యాలయంలో హోమం నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రధారణలో పవన్ యాగశాలకు వచ్చి.. దీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించి.. జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసించే పవన్.. ఈ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ.. తాను తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారని తెలిపింది.
యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అష్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు.. ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ఉదయం ప్రారంభమైన యాగం రేపు కూడా కొనసాగుతుంది. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది, సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది.
యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా.. మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా.. కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్దంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది. ఇదే సమయంలో.. కార్యాలయ ప్రాంగణంలో భవన నిర్మాణం కోసం పవన్ భూమి పూజ నిర్వహించారు.విజయవాడ దుర్గగుడిలో వారాహి పొలిటికల్ యాత్ర సక్సెస్ కావాలంటూ జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లుండి నుంచి ప్రారంభంకానున్న పవన్ వారాహి యాత్ర ఎలాంటి ఆటంకాల్లేకుండా కొనసాగాలని 108 కొబ్బరికాయలు కొట్టారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా.. చెడు దృష్టి పడకుండా ఉండేందుకే కొబ్బరికాయలు కొట్టామన్నారు జనసేన నేత పోతిన మహేశ్.