ఏపీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. సీఎం కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జమ చేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ 18,002 కోట్లను వ్యయం చేస్తోంది.పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది.
ఐటీఐ విద్యార్థులకు 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి 20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో 72 వేల 919 కోట్లు ఖర్చుచేసింది. ఇవాళ ఉదయం10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సభ అనంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మధ్యాహ్నం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.


