స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది జగన్ (CM Jagan) సర్కార్. పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్ సున్నా వడ్డీని ఈ నెల 11 (శుక్రవారం) మరో విడత విడుదల చేయనున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత డబ్బుల్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం(Amalapuram) నుంచి ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్లలోకి విడుదల చేస్తారు. మొత్తం 9.48 లక్షల డ్వాక్రా గ్రూపుల్లోని మహిలలకు రూ.1358.78 కోట్లను విడుదల చేయనున్నారు.
సున్నా వడ్డీ నిధుల విడుదలకు సంబంధించిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan) ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జులై 26న ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది.. కానీ ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును.. అది కూడా గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉన్న రుణాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించే డ్వాక్రా మహిళలకు ఇప్పటి వరకు వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.4,969.05 కోట్లు చెల్లించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు కూడా జగన్ సర్కార్ చేపట్టింది.