ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఈ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం అని అన్నారు. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ అవడం నారీశక్తికి బలమైన నిదర్శనం అని చెప్పారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ అని తెలిపారు. సుధామూర్తి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.


