స్వతంత్ర వెబ్ డెస్క్: వైసీపీ నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించామని, వారి ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(AP Minister Dharmana Prasada Rao) అన్నారు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుతో పాటు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న శ్రీకాకుళంలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పార్టీ నాయకత్వంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట నిజమేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సీఎం జగన్(CM Jagan) ప్రవేశపెట్టారని అన్నారు. దీనివల్ల తమ చేతిలో ఉన్న అధికారాలు తీసేశారనే ఆవేదన, బాధ కార్యకర్తల్లో ఉందన్నది వాస్తవమేనని, తాను కాదనని అన్నారు. ఇలా అయితే, ప్రజల్లో పార్టీపై తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు.