బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం ముదురుతోందా.. ఒక్కొక్కరుగా కారు దిగి చేతిని అందుకుంటున్నారా.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత గులాబీ పార్టీ ఖాళీ అవుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతున్నాయి. పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరికలు చూస్తుంటే .. కాంగ్రెస్ పార్టీ రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి .. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలని ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలికింది. అనుకున్న తడవుగా 2014లో టీడీపీని ఖాళీ చేయించింది. 2018లో కాంగ్రెస్ను ఖాళీ చేయించాలనే లక్ష్యంతో గులాబీ బాస్ పార్టీ గేట్లు తెరిచారు. ఎమ్మెల్యేలు, నేతలను పార్టీలో చేర్చుకున్నారు. దాదాపు ప్రతిపక్షం అనే పదం లేకుండా చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ వేసిన పాచికలనే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇప్పుడు తన టైమ్ వచ్చింది కాబట్టి.. గులాబీ పార్టీని ఖాళీ చేసే వ్యూహాలకు పదునుపెట్టాడు. లోక్ సభ ఎన్నికలకు ముందు హస్తం పార్టీ గేట్లు తెరిచాడు. గేట్లు తెరవడం ఆలస్యం అన్నట్టుగా నేతలు సైతం రెక్కలుగట్టుకుని వాలిపో తున్నారు. కార్పొరేటర్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కట్టారు.
తాజాగా పార్టీకి కీలకంగా ఉన్న కే కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మీ బీఆర్ఎస్ను వీడుతున్నట్లు ప్రకటించడం కేసీఆర్కు మింగుడుపడటం లేదు. కేకే తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా పార్టీని వీడుతుండడం సంకటంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. బీఆర్ఎస్ చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లోకి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరగా.. ఆమెకు మల్కాజిగిరి టికెట్ లభించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారపార్టీలో చేరి, సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించుకున్నారు.
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీపాటిల్ బీజేపీలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పి.రాములు బీజేపీలో చేరగా.. ఆయన కుమారుడికి టికెట్ లభించింది. మాజీ ఎంపీలు జి.నగేశ్, అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. వరంగల్ నుంచి టికెట్ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇక వెళ్లేవాళ్లు వెళ్లకుండా లేఖలు రాయడం.. ఆ లేఖలో కవిత అరెస్ట్, పార్టీ పరిస్థితిని ఎండగట్టడం వంటి అంశాలతో గులాబీ బాస్కు మరితం సంకటంగా మారింది. ఇప్పుడున్న పార్టీ పరిస్థితికి ఇంకెంతమంది జంపింగ్ జపాంగ్లు ఉన్నారోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో నేతలను వలస పోకుండా చూసుకోవడమే గులాబీ బాస్కు పెద్ద టాస్క్లా మారింది.