పిడకల సమరం
కర్నూలు జిల్లా అస్పరి మండలం కైరుప్పల గ్రామం పిడకల సమరంకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉగాది పండుగ మరుసటి రోజు భద్రకాళి, వీరభద్ర స్వామివార్ల సన్నిధిలో ఈ కార్యక్రమంను గ్రామస్తులు నిర్వహిస్తారు. వందల ఏళ్లనాటి ఈ సాంప్రదాయ సమరానికై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. కారుమంచి గ్రామస్తులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఈ సమరం ముగిసిన మరుసటి రోజు భద్రకాళి, వీరభద్ర స్వామివార్లకు వివాహం జరిపిస్తారు గ్రామస్తులు.
టీడీపీకి షాక్
గుంతకల్లులో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి సమక్షంలో తెలుగు దేశం పార్టీకి చెందిన సుమారు మూడు వందల కుటుంబాలు వైసీపీ కండువా కప్పుకున్నాయి. పార్టీ మారిన వారిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డేరంగుల ఉదయ్ కిరణ్, గుంతకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ లు ఎన్ రామలింగప్ప, జింకల రామాంజనేయులు తదితరులు ఉన్నారు.
సంక్షేమ బాట
సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
పాదయాత్ర
సికింద్రాబాద్ లస్కర్ జిల్లా సాధన కోసం పాదయాత్ర చేపట్టారు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పారడైజ్, రసూల్పుర, బేగంపేట్, అమీర్పేట్ మీదుగా బల్కంపేట అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగింది. జిల్లా జిల్లా ఏర్పాటైతే భావితరాలకు విద్య ఉపాధి ఆరోగ్య విషయాల్లో మరింత ప్రయోజనం ఉంటోందన్నారు గౌడ్.
12న ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు పేర్కొన్నారు. జవాబు పత్రాల మూల్యాంకన, పేపర్ల స్కానింగ్కు సంబంధించిన ప్రక్రియ ముగియడంతో రీ వ్యాల్యుయేషన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా రెండు రోజుల్లో పూర్తి కానుండటంతో ఫలితాల విడుదలకు విద్యా మండలి సన్నధ్దమౌతోంది.
అమ్మవారి సన్నిధిలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న అనంతరం న్యాయమూర్తి సంజయ్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసారు అధికారులు.
ఎప్పటికీ మారని మనిషి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆయన సోదరుడు నాగబాబు రిలీజ్ చేసిన ఓ వీడియో ఆసక్తి రేపుతోంది. ఎప్పటికీ మారని మనిషి అనే పేరుతో దీన్ని రిలీజ్ చేయగా ‘ మ్యాన్ వు నెవర్ చేంజ్డ్ ‘ అనే ఇంగ్లీషు వ్యాఖ్యాన్ని జోడించారు. పవన్ జీవిత కాల జర్నీలోని ముఖ్య అంశాలు ఈ స్పెషల్ వీడియోలో చూపించారు. పంచభక్ష పరమాన్నలు చేతికందాయి… కానీ ఆ గొంతులోకి ముద్ద దిగలేదు వంటి కొటేషన్స్ను జోడించారు. ఈ వీడియో నిడివి 4 నిమిషాల 31 సెకండ్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కత్తితో దాడి
బకాయి పడ్డ డబ్బులు అడిగినందుకు ఓ వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ మధురనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మహమ్మద్ అజర్ అనే పండ్ల వ్యాపారికి అబ్దుల్ నవీద్ డబ్బులు బకాయిపడ్డాడు. దీంతో బకాయిపడ్డ డబ్బులు కోసం అజర్ అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అజర్ పై కత్తితో దాడి పాల్పడ్డాడు నవీద్. బాధితుడి ఫిర్యాదు మేరకు మధురా నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
జ్యోతిష్యుడిపై ప్రతాపం
చిలుక జోస్యం చెప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్న సెల్వరాజ్ అనే వ్యక్తిని వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపింది అటవీశాఖ. తమిళనాడు రాష్ట్రం కడలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ కూటమిలోని పీఎంకే అభ్యర్ధి తంగర్బచ్చన్ ఎన్నికల ప్రచారంలో చిలుక జోస్యం చెప్పించుకోవడం సెల్వరాజ్ పాలిట పాపంగా మారింది. ఈ దృష్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో సెల్వరాజ్ను అరెస్టు చేసారు. డీఎంకే ప్రభుత్వ ప్రతీకార ధోరణికి ఇది అద్దంపడుతోం దన్నారు పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్.
డేంజర్ లేక్స్
భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ హిమానీనదాలు కరిగిపోయే వేగం కూడా పెరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో హిమాలయ ప్రాంతంలో వరదల ఘటనలు ఇందుకు కారణంగా చెప్తున్నారు. ఉత్తరఖాండ్లోని 13 సరస్సులు ప్రమాదంలో ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ సరస్సులు ప్రమాదకరంగా పేర్కొంది. మూడు వర్గాలుగా విభజించి 5 సరస్సులను ఏ కేటగిరీలో ఉంచింది. బీ కేటగిరీలో నాలుగు, కొంచె తక్కువ ప్రమాదం ఉన్న నాలుగు సరస్సులను సీ కేటగిరీగా పేర్కొంది. వసుంధర తాల్, భిలాంగనా సరస్సుల వ్యాప్తి వేగంగా పెరుగుతున్నట్లు గుర్తిం చింది.
జాతీయ మాస్టర్స్ గేమ్స్
పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ జాతీయ మాస్టర్స్ గేమ్స్ కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. హైదరా బాద్ ఎల్బీ స్టేడియం ఒలింపిక్ భవన్ లో ఈ క్రీడల పోస్టర్ ను రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీ శ్వర్ యాదవ్ ఆవిష్కరించారు. వచ్చే నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలను ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలలో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. అథ్లె టిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర క్రీడాంశాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు.
విజయకాంత్కు జట్టులో స్ధానం
గాయం కారణంగా IPL మ్యాచ్లకు దూరమైన SRH ప్లేయర్ హసరంగ స్ధానంలో స్పిన్నర్ విజయ కాంత్ ను జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. SRH ఫ్రాంచైజ్ విజయకాంత్తో 50 లక్షలకు ఒప్పందం చేసుకుంది. గతేడాది శ్రీలంక తరపున అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన విజయకాంత్ ఈ ఏడాది దుబాయ్ I L T – 20 లీగ్లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్కు ప్రాతినిధ్యం వహించాడు.
వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కాస్తంత తగ్గాయి. వాతావారణ శాఖ కూడా రాగల నాలుగు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.


