లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి. కరువు పేరిట రాజకీయ యుద్ధానికి తెరలేపుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురు తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పొలాలను పరిశీలిం చేందుకు పల్లెబాట పట్టారు. అటు బీజేపీ కూడా రైతుల పక్షాన ఆందోళనకు దిగింది. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం బండి సంజయ్ కరీంనగర్ వేదికగా రైతుదీక్ష చేపట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు తాజాగా మరో దఫా ఆందోళనకు సిద్ధమైంది కమలదళం.
ఇవాళ్టి నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో ఆందోళనకు దిగనున్నారు. రంగారెడ్డి జిల్లాలో కిషన్రెడ్డి , మహబూబ్నగర్లో డీకే అరుణ, సంగారెడ్డిలో లక్ష్మణ్ దీక్షలో పాల్గొంటారు. రైతు భరోసా 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతన్నల కన్నీళ్లు తుడవా లని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు సాగునీటిని అందివ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహం దీక్షకు బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు.


