మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను సిబ్బంది కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 8న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించారు. తాజాగా ఇవాళ వాటి కూల్చివేతలు చేపట్టారు. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ తొలగించారు.
దివ్యనగర్ లేఔట్లోంచి తమ నివాసాలకు, పక్కనే ఉన్న దారులను మూసేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ నల్లమల్లారెడ్డిపై పలు కాలనీవాసులు ఫిర్యాదులు చేశారు. ఆయా ఫిర్యాదులపై ఈ నెల 23న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఇరు పక్షాలతో కమిషనర్ రంగనాథ్ చర్చించారు. దారులు మూసేయడమే కాకుండా.. ఆ లే ఔట్లలోని తమ ప్లాట్లు అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైడ్రా చర్యలుచేపట్టింది.
దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో పలు కాలనీలకు మార్గం సుగమం అయింది. కాగా, రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో దివ్య లేఔట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2 వేల 218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్లమల్లారెడ్డివేనంటూ స్థానికుల సమాచారం. ప్లాట్ యజమానులను బెదిరించడమే కాకుండా.. సర్వే నంబరు 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్లమల్లారెడ్డి కబ్జాచేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.


