కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా సాగుతున్నాయి గ్రూపు రాజకీయాలు. దీంతో ఎవరి మాటలో వినాలో తెలియక అయోమయంతో క్యాడర్ ఉక్కిరిబిక్కిరవు తోంది. ఇంతకీ ఏంటా గ్రూపు రాజకీయాలు..? ఎవరా నేతలు.. ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది.?
బాన్స్వాడ ఇలాఖాలో కాసుల బాలరాజు వర్సెస్ ఏనుగుల రవీందర్రెడ్డి పాలిటిక్స్తో క్యాడర్ తెగ ఇబ్బంది పడుతోంది. వారిద్దరి మధ్య ఈగో అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం లేకుండా చేస్తోంది. మొదటి నుంచి బాన్స్వాడ నియోజవర్గ ఇన్చార్జ్గా కాసులు బాలరాజే ఉండటంతో.. ఇన్నాళ్లూ అక్కడ ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బాన్స్వాడ కాంగ్రెస్లో కాసుల ఎంత చెబితే అంత. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపో యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కాసుల బాలరాజును కాదని పక్క నియోజకవర్గమైన ఎల్లారెడ్డి నేత ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్స్వాడ టికెట్ ఇచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వైరం షురూ అయింది. ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు కాసుల బాలరాజు. చివరి నిమిషంలో ఆయనను పక్కన పెట్టి ఏనుగుల రవీందర్రెడ్డికి అవకాశమిచ్చింది హైకమాండ్. దీంతో బాన్స్వాడ హస్తం శిబిరంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కాసుల, ఏనుగు వర్గాలు గా చీలింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని కాసుల సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. అయితే అధిష్టానం బుజ్జగించటంతో కాసుల అలక వీడారు. కానీ ఏనుగుపై మాత్రం కోపంపోలేదు. తనవల్లే టికెట్ పోయిందన్న ఉక్రోశం సఖ్యతగా ఉండనివ్వడం లేదు. ఈ పరిణామా లతో పార్టీ రెండు క్యాడర్లుగా వీడిపోయింది. ఇక బుజ్జగింపుల్లో భాగంగా కాసులకు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది హైకమాండ్. అయినప్పటికీ ఆయన ఆగ్రహం మాత్రం తగ్గలేదు.
హైకమాండ్ ఎంత చెబుతున్నా ఆ ఇద్దరు నేతలు ఎవరికి ఎవరూ తగ్గడం లేదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నా, మంత్రుల పర్యటనలు ఉన్నా ఒక వర్గం హాజరైతే మరో వర్గం డుమ్మా కొట్టడమే. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరు వర్గాల క్యాడర్ ఇబ్బందులు పడుతోంది. కాసుల వద్దకు వెళ్తే ఏనుగు కోపం. ఏనుగు మాట వింటే కాసులకు ఆగ్రహం. దీంతో రెండు వర్గాల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు బాన్సువాడలో అధికారులపై ఏనుగు రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజు ఆధిపత్యం ఎక్కువైందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో అటు అధికార యంత్రాoగం కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ పనుల కోసం అధికారులను సంప్రదిస్తే ఏ నేత వరం అని అడిగే స్థాయికి వచ్చిందట వ్యవహారం. ఇలా అటు అధికారులకు ఇటు క్యాడర్ కు పెద్ద తలనొప్పిగా మారింది ఇరు నేతల ఆధిపత్య పోరు. అయితే, ఇదే విషయాన్ని హైకమాండ్కు చేరవేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. ఇకనైనా మార్పు రావాలని, ఇద్దరు నేతలు ఒక్కటిగా వ్యవహరించాలని క్యాడర్ ఆశిస్తోంది. మార్పు కోసం ఎదురుచూస్తోంది. లేదంటే పార్లమెంట్ ఎన్నికలపై, భవిష్యత్తులో పార్టీపై ప్రభావం చూపే అవకాశముందంటున్నాయి రాజకీయ వర్గాలు.