స్వతంత్ర వెబ్ డెస్క్: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరికి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వరదతో ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు.. లంక గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. వరద ముంపులో చిక్కుకుని అల్లాడుతున్నాయి. పదిరోజులుగా ప్రమాదకర పరిస్థితుల్లో పడవలపైనే ప్రయాణాలు సాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు ముంపు బాధితులు.
తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీలోనూ గోదావరికి వరద పోటెత్తుతోంది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరుకుంది. వరద ఉధృతితో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే.. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 14లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం మరింత ఎక్కువ కావడంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద కొనసాగుతోంది. దాంతో.. ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే అల్లాడుతున్నాయి. పదిరోజులుగా ప్రమాదకర పరిస్థితుల్లో పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు. అయితే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అధికారులు వచ్చి మునిగిపోయిన కాజ్వేలను చూసి వెళ్ళిపోవడం తప్ప చేసిందేంలేదని స్వతంత్ర టీవీతో వాపోయారు. అయినవిల్లి-ఎదురుబిడియం కాజ్ వే నిర్మించాలని నాయకులకు ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్నవారే లేరంటున్నారు. అయినవిల్లి మండలంలో అయినవిల్లిలంక, వీరవిల్లిపాలెం, పల్లపులంక, అద్దంకివారిలంకతోపాటు పలు లంక గ్రామాల ప్రజలు వరదల సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.


