గన్నవరం..! ఇది అలాంటి ఇలాంటి నియోజకవర్గం కాదు.. ఎందరో హేమాహేమీల్లాంటి నేతలు ప్రాతినిథ్యం వహించినది. కమ్యూనిస్ట్ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారు ఇక్కడ్నుంచి బరిలో దిగి ప్రజలకు ఎంతో సేవ చేశారు. అందుకే ఇప్పటికీ ఆ భావజాలం ఇక్కడి ప్రజల్లో అండర్ కరెంటులా ప్రవహిస్తూనే ఉంటుంది. అంతే కాదు.. ఎప్పటికప్పడు వివిధ కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ఈ నియోజకవర్గం. మరి.. ఇక్కడి రాజకీయ పరిస్థితులు ఏంటి ? రాబోయే ఎన్నికల వేళ.. ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థుల సంగతేంటి ?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గం గన్నవరం. పేరుకు ఇది ప్రత్యేక నియోజకవర్గమే కానీ, విజయవాడ నగరానికి కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే ఇక్కడి ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా బెజవాడకు వెళ్తుంటారు. అందుకే.. గన్నవరం రాజకీయా లన్నీ విజయవాడ చుట్టూనే తిరుగుతుంటాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి పోటీ చేసి 2019లో గెలుపొందారు.. వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్గగడ్డ వెంకట్రావ్ ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థి కూడా వెంకట్రావే. మరోవైపు.. వైసీపీ నుంచి వంశీయే పోటీ చేయడం ఖాయమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గన్నవరం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. సీపీఐ అభ్యర్థిగా ప్రముఖ కమ్యూనిస్ట్ నేత పుచ్చలపల్లి సుందరయ్య పోటీ చేశారు. ఇప్పటి వరకు 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. అందులో కమ్యూనిస్టులు 3 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలోని గ్రామాలు పూర్తిగా, విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలతో కలిపి నియోజకవర్గాన్ని పునర్విభజించారు. తూర్పున ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు, పశ్చిమాన విజయవాడ రూరల్ మండలంలోని పి. నైనవరం, దక్షిణాన రామవరప్పాడు, ఉత్తరాన బొమ్ములూరు గ్రామాలు ఉన్నాయి. ఇక, మొత్తం ఓటర్ల సంఖ్య 2,30,634గా ఉంది. ఇందులో పురుషుల సంఖ్య 1 లక్షా 13 వేల 551మంది ఉండగా, మహిళల సంఖ్య 1 లక్షా 17 వేల 055గా ఉంది.
2019 ఎన్నికల్లో కేవలం 838 ఓట్ల మెజార్టీతో వల్లభనేని వంశీ విజయం సాధించారు. తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకి 1 లక్షా 03 వేల 881 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకి 1లక్షా 03వేల 043 ఓట్లు వచ్చాయి. గన్నవరం నుంచి పోటీ చేసిన వారు ఇలా తక్కువ మెటార్జీతో గెలుపొందడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ పలుమార్లు ఇలా జరిగింది. 1983 ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థి ముసునూరు రత్నబోస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కొమ్మినేని శేషగిరిరావుపై పన్నెండు వందల పదకొండు స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, 2004లోనూ కాంగ్రెస్ నుంచి ఎం.వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి డి.వి.బాలవర్థన్ రావుపై 2 వేల 235 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించే సరికి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. వైసీపీ కేండిడేట్ ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి వచ్చింది. అయితే.. అధికారికంగా చెప్పకపోయినా వల్లభనేని వంశీ ఖరారైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే బుజ్జగింపుల పర్వం మొదలైందని చెప్పాలి. మరోవైపు నియోజక వర్గంలో సమస్యలు నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ పాలనలో కూడా వచ్చిన మార్పులేవీ లేవన్న వాదన విన్పిస్తున్నారు సామాన్య ప్రజలు.
రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నియోజకవర్గాల్లో ఒకటి గన్నవరం. ఇక్కడ రాజకీయం అంటే రసవత్తరంగా ఉంటుం దనే చెప్పాలి. వైసీపీ నుంచి ఇంకా ప్రకటించకపోయినా వల్లభనేని వంశీ పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి. అదే టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ బరిలో దిగారు. దీంతో.. ఇక్కడ పోరు నువ్వా-నేనా అన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. వైసీపీలో అసంతృప్తులు ఉండడంతో ఇటీవలె కొడాలి నానితో కలిసి వల్లభనేని వంశీ… సీఎం జగన్ని కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. దీంతో..అధిష్టానం అసంతృప్తులను పిలిచి బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఆయన పార్టీలోనే కొనసాగేలా తాడేపల్లి పెద్దలు ఒప్పించారని సమాచారం. అంతేకాదు వల్లభనేని వంశీకి సహకరించమని దుట్టా సహా ఇతర అసంతృప్తులకు చెప్పిన ట్టు ప్రచారం జరుగుతోంది.
క్వారీ, మట్టి తవ్వకాలకు కేరాఫ్ అడ్రస్గా గన్నవరం నియోజకవర్గం మారిందన్న విమర్శలున్నాయి. అనుమతి కొంత వరకు మాత్రమే తీసుకునే కాంట్రాక్టర్లు.. ఇదే అదనుగా మొత్తం కొండలన్నీ తవ్వుకుంటూ వెళ్లిపోతారు. ఈ విషయంలో ఎవరూ నోరు మెదపకుండా ఉండేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరికీ మామూళ్లు వెళ్లిపోతుంటాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎవరైనా గట్టిగా అడిగితే పర్మిషన్ లెటర్ చూపిస్తారు. వాళ్లు ఎంత తవ్వుతున్నారో, వీళ్లు వెళ్లి కొలవలేరు కదా అన్నది వారి ధైర్యం. ఇంకా పరిస్థితి ముందుకు వెళ్లిందంటే జులుం ప్రదర్శిస్తారు. దీంతో.. ఎవరికి వారు మనకు ఎందుకులే అని ఊరుకుంటున్నారనే చెప్పాలి.
గన్నవరం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంగా ఉండటంతో… కార్మికులు ఎక్కువగా ఉంటారు. అయితే.. చాలీ చాలని వేతనాలతో ఇక్కడి ప్రజల పరిస్థితులు దుర్భరంగా ఉంటాయనే చెప్పాలి. పారి శుద్యం లేకపోవడంతో కార్మిక కుటుంబాలు అనారోగ్యాల బారిన పడుతున్నాయి. అలాగని ఆస్పత్రికి వెళితే.. సరైన సౌకర్యాలు లేవు. ఇక, వ్యవసాయ కార్మికులు కూడా నియోజకవర్గంలో ఎక్కువే. ఇక్కడ నుంచి ఆటోల మీద పొలం పనులకు వెళ్లి వస్తుంటారు ఎంతోమంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తమ బతుకులు మారలేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గన్నవరం నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బెంజ్ కంపెనీలు, అలాగే పలు కార్ల షోరూమ్స్ ఉన్నాయి. నిత్యం ఉద్యోగులు, వ్యాపారులతో కళకళలాడుతూ ఉంటుందీ ప్రాంతం. అలాగే అన్నదాతలకూ నెలవైన నియోజకవర్గం గన్నవరం అనే చెప్పాలి. గన్నవరం నియోజ కవర్గంలో పేరుపొందిన అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడకి అతి దగ్గరగా ఉండే ఈ ఎయిర్ పోర్ట్ నుంచి దేశ విదేశాలకు విమాన సౌకర్యం ఉంది. ఒకప్పడు నిరుపయోగంగా ఉన్న ఎయిర్పోర్ట్ నేడు కళకళలాడుతోంది. రాష్ట్ర విభజన అనం తరం గన్నవరం విమానాశ్రయానికి ఎక్కువ గుర్తింపు వచ్చింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాటి సీఎం చంద్రబాబు…గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు.
నియోజకవర్గంలో ఐటీ పార్కు, సూరంపల్లి పారిశ్రామిక వాడ, పశుదాణా కర్మాగారం, డెల్టా షుగర్స్, పట్టుగూళ్ల పరిశ్రమ సహా మరెన్నో ఉన్నాయి. పెదఅవుట్ పల్లిలో జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రం ఉంది. ఇక, చిక్కవరం గ్రామంలో బ్రహ్మయ్య లింగం ఆలయం, హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి. బాపులపాడు మండలంలో ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కవి సామ్రాట్, రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ, తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహనరావు, కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య సహా ఎందరో ప్రముఖులు ఇక్కడి నుంచి వచ్చిన వారే కావడం విశేషం. అధునాతన వ్యవసాయ పద్దతులతో నియోజకవర్గంలోని రైతన్నలు సాగు చేస్తుంటారు. వరి, కూరగాయలు, మొక్కజొన్న, పామాయిల్, అపరాలు, మామిడి అధికంగా ఇక్కడ పండుతాయి. పోలవరం కాలువల ద్వారా గన్నవరం నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. దాదాపు 30 కిలోమీటర్లు మేర ప్రవహిస్తూ వచ్చే ఈ జలాలు కొన్ని వేల హెక్టార్ల భూములను సస్యశ్యామలం చేస్తున్నా యి. గన్నవరం ఎయిర్పోర్ట్ను మరింతగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో విన్పిస్తోంది. అలాగే.. పారిశ్రామక వాడలో పనిచేసే కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన ఇక్కడ గట్టిగా ప్రతిధ్వనిస్తోంది. దీంతో.. రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి అయినా తమ కష్టాలు తీరుస్తారా అని ఎదురుచూస్తున్నారు ఇక్కడి ప్రజలు.