స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని సరూర్నగర్ సభా వేదికకు చేరుకున్న భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ.. మొట్టమొదటగా జైబోలో తెలంగాణ అని ప్రసంగాన్ని ప్రారంభించింది. సరూర్నగర్ సభా వేదికలో మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడుతూ.. తెలంగాణ మీకు నేలకాదు, తల్లిలాంటిది. నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని అన్నారు. తెలంగాణలో కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నోత్యాగాలు చేసిందంటూ వ్యాఖ్యానించారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు పడిన ఆ బాధ ఏంటో మాకు తెలుసు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదన్న ప్రియాంక… తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నా ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదని అన్నారు.
ఇప్పటివరకు ఒక్క యూనివర్శిటీని కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదు. అలాగే నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో చేరేవారి సంఖ్య తగ్గిందని అన్నారు. మీ డబ్బులు అన్నీ ఎక్కడికిపోతున్నాయో ఆలోచించండి అంటూ ప్రియాంక తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.