జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. విశాఖ వేదికగా ఏర్పాట్లలో మునిగారు వైసీపీ నేతలు. దీంతో ఎన్నికల ఫలితాలపై అధికార పార్టీ నాయకుల అంత ధీమాగా ఉన్నారా..? పోలింగ్ సరళి ఆ లీడర్లకు అనుకూలంగా వుందా..? అందుకే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు అధికార పార్టీ వర్గాలు.
ఏపీలో ఈ ననెల 13వ తేదీన పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర చరిత్రలో మొదటి సారి 81 శాతం పోలింగ్ నమోదు కావడం.. పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు పోటెత్తడంతో ఎవరికి వారు పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉందన్న ధీమాలో ఉన్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా అధికార వైఎస్ నేతలు పోలింగ్ శాతం పెరగడం తమకు కలిసి వచ్చే అంశమని అంటున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ముఖ్యంగా మహిళలు, వృద్దులు తమకే ఓటు వేశారన్న అంచనాలో ఉన్నారు. మరోవైపు గతంకంటే కూడా ఎక్కువగా అంటే.. 150కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, 22 రెండు ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని ప్రకటించారు వైసీపీ అధినేత సీఎం జగన్. దీంతో వైసిపి నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. సీఎం జగన్ ఒక మాట చెప్పారు అంటే అది కచ్చితంగా జరిగి తీరుతుంది అని బలంగా నమ్ముతున్నారు.
ఇక అదే నమ్మకంతో జూన్ 4న వెలువడే ఫలితాల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీ సాధించి.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. దీంతో జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు పార్టీ ముఖ్య నేతలు. జూన్ 9వ తేదీన ఉదయం 9.38 నిమిషాలకు ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే,..రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని మొదటి నుంచి చెబుతున్నారు సీఎం జగన్. ఇక ఎన్నికలకు మూడేళ్ల ముందే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించగా.. ఇప్పటికే అక్కడ సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణం కూడా పూర్తి అయింది. దీంతో విశాఖలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా పాలన అక్కడ నుంచే కొనసాగించేందుకు సిద్దం అయినట్టు తెలుస్తోంది.
ఓ వైపు విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసిన అధికార పార్టీ నేతలు విజయం తమదేనని ధీమాలో ఉంటే.. అటువైపు నుంచి ఎన్డీఏ నేతలు కూడా తామే గెలిచి తీరుతామంటున్నారు. అయితే,.. కూటమి లీడర్లు గెలుపు ధీమాలో ఉన్నారు కానీ.. ఇంతవరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ మీడియా ముందుకు వచ్చి తామే అధికారంలోకి వస్తామని చెప్పడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అన్న సందేహాలు టీడీపీ, జనసేన వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఇంతకీ అధికారం విపక్ష కూటమి చేతుల్లోకి వెళ్తుందా..? లేదంటే మళ్లీ సీఎం జగనే సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటారా..? అధికార పార్టీ నేతలు ఆశిస్తున్నట్టు విజయం వారినే వరిస్తుందా..? అందుకే అంత ధీమాగా ప్రమాణస్వీకారానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశాలుగా మారాయి. అయితే,.. ఎవరి మాటల్లో నిజమెంత ఉంది..? ఎవరికి ప్రజలు సపోర్ట్గా నిలిచారన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ వేచి చూడాల్సిందే.