కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలని అడిగిన పాపానికి రైతులను కుక్కలతో పొలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా అప్పారావుపేట లోని వరి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు జాప్యం పై జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి తొందరగా కొనుగోలు చేయాలని కోరారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు సన్న రకాలకే బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేదాకా రైతుల పక్షాన నిలబడి పోరాడుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.


