ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ క్లిష్టపరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ సారి ఎన్నికలు బీఆర్ ఎస్ కు, నామా నాగేశ్వరరావు ప్రతిష్టకు సవాల్ గా నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీదళం ఓటమి పాలైన తర్వాత చిన్నా, పెద్ద నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో బీఆర్ ఎస్ తరుపున గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ వైపు పోవడంతో పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో గులాబీ దళానికి అగ్నిపరీక్షే.
2019 లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, మహబూబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో గులాబీ వికసించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా, 2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత విజయం సాధించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 అసెంబ్లీ స్ధానాల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరారు. ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో విజయం కోసం చెమటోర్చవలసి వస్తోంది. ఈ ఎంపీ ఎన్నికల్లో నెగ్గి పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలని అటు అభ్యర్ధులు ఇటు కేడర్ ఉన్నంతలో ప్రచారాన్ని కొన సాగిస్తు న్నారు.
మూడు టర్మ్ ల నుంచి విజయపరంపర సాధించిన ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి , పార్టీ లోక్సభాపక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు శక్తివంచన లేకుండా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం సాగిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ జిల్లా చీఫ్ తాత మధుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తప్ప ఇతర నియోజకవర్గ ప్రచారాల్లో పాల్గొనడంలేదు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీకి దూరంగా ఉన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, వైరాలో బానోత్ మదన్లాల్, బానోత్ చంద్రావతి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు ప్రచారం కొనసాగిస్తున్నారు.
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు, పినపాకలో కాంగ్రెస్ గెలవగా భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు గెలిచారు. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 లక్షల47 వేల 214 ఓట్లు లభించగా, బీఆర్ఎస్కు లక్షా,16వేల ,118 ఓట్లు లభించాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 86 వేల096 ఓట్లు ఆధిక్యత లభించింది. ఇటు ఖమ్మం, అటు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే భారీ ఆధిక్యత సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 3 లక్షల52 వేల258 ఓట్ల ఆధిక్యత అసెంబ్లీలో లభించింది.
ఇటు ఖమ్మంలో నామా గెలుపుకోసం … మాలోతు కవిత కోసం పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ క్యాడర్కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీకి మనుగడ. మహబూబాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాలోతు కవిత, బీజేపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఇంకా తేలాల్సి ఉండగా బీఆర్ఎస్ నుంచి నామ నాగేశ్వరరావు, , బీజేపీ నుండి తాండ్ర వినోద్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి జెండా ఎగరవెయ్యగా మహబూబాబాద్లో 2014లో సీతారాంనాయక్, 2019లో మాలోతు కవిత విజయం సాధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా దారుణంగా ఓటమిపాలైంది. తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ కేడర్తో పాటు టీడీపీ సానుభూతి ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఖమ్మం లోక్సభ నియోజక వర్గం పరిధిలో కాంగ్రెస్, సీపీఐ కూటమి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వరావు పేట, కొత్తగూడెం నియోజకవర్గాలుండగా కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ విజయం సాధించింది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 9 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుడ టం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ మెజారిటీ సాధించినందువల్ల కాంగ్రెస్ విజయంపై ధీమాతో ఉంది. ఫలితంగా బీఆర్ఎస్కు ప్రస్తుత లోక్సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.


