BRS | ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను సాదించాలని ఆనాడు నడుం బిగించిన కేసీఆర్.. ఏప్రిల్ 27, 2001 న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించాడు. సుదీర్ఘ కాలం తర్వాత టీఆర్ఎస్ హయాంలో తెలంగాణను సాధించి.. రెండు సార్లు సీఎంగా గెలుపొందాడు. దేశమంతటా తెలంగాణ తరహా అధివృద్ది ఫలాలు అందజేయాలని.. టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా విస్తరించాడు. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా మినీ ప్లీనరీలు నిర్వహించేందుకు బీఅర్ఎస్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎలక్షన్స్ సమీపించడంతో నియోజకవర్గ స్థాయి ప్లీనరీని నిర్వహించాలని పిలుపునిచ్చింది. రాష్ట్రమంతటా ఈరోజు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లలో ప్రతినిధుల సభలు జరగనున్నాయి.
సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల సభల్లో కనీసం 6 తీర్మానాలు చేయాలని భావించింది. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ.. అధికారం చేపట్టి తొమ్మిదేళ్ల అవుతున్న తరుణంలో పార్టీ ఎదుర్కొన్న ఆటుపోట్లు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. అయితే ఈ ప్లీనరీల నిర్వహణకు ప్రతి నియోజకవర్గం నుండి సుమారు మూడున్నర వేల మంది ప్రతినిధులతో సభ నిర్వహించాలని సూచిందింది. ఈ లెక్కన చూసుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది ఈరోజు సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, మేయర్లు, ఛైర్మన్లు, బీఆర్ఎస్ నేతలు సహా దాదాపు మూడు వేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.