స్వతంత్ర వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. బికనేర్ నగర ప్రాంతంలో మంగళవారం రాత్రి 11.36 గంటలకు సంభవించిన భూకంపంతో ఇళ్లలో నిద్రపోతున్న జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. బికనేర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్వీట్ చేసింది. ఉత్తరభారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని రాజస్థాన్ అధికారులు చెప్పారు.జమ్మూ కశ్మీర్, అసోం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.