స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను వెంటనే ఆదుకోవాలని అన్నారు. మోరంచపల్లి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేయాలని కోరారు. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన శ్రేణులు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను ముంచెత్తుతోందని చెప్పారు. ఇవాళ ఉదయం భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు.
దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. అలాగే ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్లిన 40 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయిన విషయం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సత్వరమే బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ నీరు ఉప్పొంగడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.