స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కల్యాణ్కు(Pawan Kalyan) ఏమాత్రం ఇష్టంలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath,) ధ్వజమెత్తారు. ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమిస్తున్నారంటూ పవన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొత్తవలసలో వీఎంఆర్డీఏ(VMRDA) అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. “మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది” అని హితవు పలికారు.
చంద్రబాబు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి విప్పని పవన్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆయన పర్యటించిన ప్రాంతంలో ఎక్కడా లోపాలు దొరక్కపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కీ(National Green Tribunal), మోదీకి చెప్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ ఇక్కడ ఉండే ఒకట్రెండు రోజుల్లోనైనా ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోవాలని, అవాస్తవాలను మాత్రం మాట్లాడొద్దని సూచించారు.