స్వతంత్ర వెబ్ డెస్క్: మంచిర్యాల(Manchiryala) జిల్లా బెల్లంపల్లి(Bellampally) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట అర్జిన్ డైరీ సిఈఓ శేజల్(Sejal) ధర్నా చేయడం కలకలం రేపింది. సోమవారం ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చేరుకుంది. క్యాంప్ ఆఫీస్ ప్రధాన గేటు వద్ద నాకు న్యాయం కావాలంటూ ఫ్లకార్డుతో బైఠాయించింది. ఈ సందర్భంగా శేజల్ మాట్లాడారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య( MLA Durgam Chinnaiah) తనను లైంగిక వేధింపులకు గురిచేసాడని, ఎంతో మంది అమ్మాయిలను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిసిందన్నారు. అర్జిన్ డైరీకి ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ భూమిని ఎంతమందికి అమ్ముతారని ఆమె ప్రశ్నించారు.
దమ్ముంటే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్కి రావాలని సవాల్ విసిరారు. శేజల్ తొలుత హైదరాబాద్లో తనకు న్యాయం న్యాయం కోసం ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత ఢిల్లీకి వెళ్లి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. పార్లమెంటు ముందు న్యాయం చేయాలని ధర్నా కూడా చేసింది. చివరకు బెల్లంపల్లికి చేరుకొని నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేయడం జిల్లాలో దుమారం లేపింది.
పోలీసులకి సిగ్గుండాలి..!
ఎమ్మెల్యే అనుచరులు గత ఏడు నెలల నుంచి తనను బెదిరిస్తూ ప్రాణాపాయం తలపెట్టాలని చూస్తున్నారన్నారు. ఆడబిడ్డ న్యాయం కోసం పోరాడుతుంటే నిస్సిగ్గుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మద్దతు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అక్కా చెల్లెలు నాలాంటి బిడ్డలు ఉంటే ఇలాగే చేస్తారా.. అని ఆమె పోలీసులను ప్రశ్నించారు. క్యాంప్ ఆఫీస్కు పిలిపించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పోలీసులతో కిడ్నాప్ చేయించి అక్రమంగా జైల్లో బంధించారని వాపోయారు.