బండి సంజయ్(Bandi Sanjay) తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా మార్మోగుతున్న పేరు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి తనదైన శైలిలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల టెన్త్ పేపర్ లీక్ కేసులో సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంజయ్ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే సీఎం సంజయ్ అనే స్థాయికి. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నిమిత్తం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు వచ్చిన సంజయ్ ను కార్యకర్తలు తమ భుజాల మీద ఎక్కించుకుని వీవీఐపీల గ్యాలరీల వరకు తీసుకెళ్లారు. అనంతరం మోదీ సభ ముగిసిన వెంటనే అక్కడి నుంచి మళ్లీ భుజాల మీద బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ‘సీఎం సంజయ్.. సీఎం సంజయ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యకర్తల అభిమానంతో ఎమోషనల్ అయిన బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.