తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో బేగంపేట విమానా శ్రయంలో భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం 3.30గంటల నుంచీ 5.30గంటల వరకూ సమావేశమైనట్లు తెలిసింది. చంద్రబాబునాయుడును రేవంత్ రెడ్డి గురువుగా భావిస్తారు. పూర్వా శ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు కూడా నిర్వహించారు.
నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పనుల మీద వేర్వేరు ప్రైవేట్ విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ ఓ రెండుగంటలపాటు సంభాషించుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా పిలుపు మేరకు ఎన్డీఏలో చేరే విషయం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ – బిజేపీ సీట్ల పంపిణీ వంటి విషయాలపై చర్చించేందుకు నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ కి వెళ్లేందుకు బేగంపేట వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ , వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ తో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు.
ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మరో విమానంలో గురువారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీతో అలయన్స్ పై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్న తన గురువు చంద్రబాబుతో ఏం చర్చించి ఉంటారన్నది చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలైన ఎన్డీయే, ఐఎన్డీఐఏ కూటమికి నాయకత్వం వహిస్తు న్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్త పరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరు నేతలు ఎలా కలుసుకోగల రన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలు కూడా పెద్దగా బాగోలేవు. రేవంత్ సీఎం అయినా.. జగన్ కనీసం అభినందించి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ చర్చల్లో ఆ అంశం ఏమైనా ప్రస్తావనకు వచ్చిందా అన్నదీ అనుమానమే.


