తాలు, తేమ అంటూ ధన్యానికి మద్ధతు ధర తగ్గిస్తే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలుదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతుల కష్టాన్ని దోచుకుంటే సహించేది లేదని సీఎం అన్నారు. జనగామ మార్కెట్ యార్డ్ లో అన్నదాత లను మోసగించిన నలుగురు ట్రెడర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం ఆదేశించారు.
యాసంగి పంట కల్లాలకు చేరింది. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటకు రాష్ట్ర సర్కారు మద్దతు ధర ప్రకటించింది. క్వింటాలు వరి ధాన్యానికి 2 వేల 203 రూపాయల ధరను నిర్ణయించింది. అయితే.. మద్దతు ధర ఇవ్వకుండా… కొందరు దళారులు రైతులను దగా చేస్తున్నారు. జనగామ మార్కెట్ యార్డ్ లో ఇదే జరిగింది. మార్కెట్ లోని అధికారులు, కొందరు ట్రెడర్లు కుమ్మక్కై… ధాన్యం ధరను తగ్గించేశారు. దానికి ధాన్యంలో తేమ శాతం, తాలు ఎక్కువగా ఉందని ధాన్యం క్వింటాలు ధరను 1,550, 1569 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.
జనాగామ మార్కెట్ యార్డ్ లో జరిగిన దళారుల దందా పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను మోసం చేస్తే ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్ అన్నారు. తాలు, తేమ సాకుతో… ధ్యాన్యం మద్దతు ధరను తగ్గించిన నలుగురు ట్రేడర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దళారులకు సహకరించిన మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే 5,422 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చింది. రైతులకు మద్దతు ధర విషయంలో … తేడా వస్తే బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కారు హెచ్చరించింది.


