వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్(CM Jagan) బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ పథకంతో రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు జగన్ సర్కారు రూ.15వేల చొప్పున ఖాతాల్లో వేసింది. ఈ పథకం ద్వారా మొత్తం 4,39,068 మంది ఖాతాల్లో రూ.658.60 కోట్లను జమచేసింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 45-60 ఏళ్ల లోపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు ఇలాంటి పథకాలు అమలుచేయడం లేదని అన్నారు.
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు సీఎం జగన్(CM Jagan). వైఎస్ఆర్ ఈబీసీ పథకంతో అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నామని అన్నారు. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలని.. ఆ అక్కచెల్లెమ్మలకు తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమం అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమమని… అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు. ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే తన లక్ష్యమని సీఎం తెలిపారు.
Read Also: మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న రోజా.. కేక్ కట్ చేసి…