స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా క్రోసూరులో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. క్రోసూరులో ఏపీ మోడల్ స్కూల్ను సీఎం జగన్ సందర్శించి డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్ రూమ్లో విద్యార్థులతో ముచ్చటించి పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. ఇంటరాక్టివ్ ప్యాడ్ ప్యానల్పై ఆల్ ది బెస్ట్ అని రాసి విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నామని తెలిపారు. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్ధికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం. ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాని సీఎం జగన్ చెప్పారు. ప్రతి విద్యార్ధికి రూ. 2400 విలువైన కిట్టు అందించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో భోధన విలువలను పెంచేందుకు AI సాధనాలు, మెషిన్ లెర్నింగ్ విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ ఏడాది మీ జగనన్న పుట్టినరోజునే 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు అందిస్తామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా, విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ మీడియంతో సీబీఎస్ఈ సిలబస్లో బోధించేలా సిద్ధమైందని ‘మనబడి నాడు నేడు’ తొలిదశ స్కూళ్లలో 6–10వ తరగతి వరకు 30 వేలకు తరగతి గదుల్లో బైజూస్ కంటెంట్తో కూడిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ బోధన చేపట్టనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా 52మంది ఇంగ్లీష్ టీచర్లకు ఆమెరికాలో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.