ఏపీలో నూతన ఇసుక విధానంపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. కొత్త ఇసుక పాలసీపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు జరిగేందుకు, ఇసుక లభ్యత పెంచేందుకు సీనరేజ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు.
ఇసుక రీచ్లలో తవ్వకాలు, లోడింగుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విషయంపై మరోసారి ఆలోచిస్తామన్నారు సీఎం చంద్రబాబు. గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్ ద్వారా కూడా ఇసుక తరలించుకునేందుకు అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే ఇసుక తీసుకువెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు సీఎం చంద్రబాబు.