స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రుని ఉపరితలం వైపు చంద్రయాన్-3 (Chandrayan-3) ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరింది. సోమవారం చంద్రునివైపు చంద్రయాన్ -3 స్పీడ్ పెంచారు ఇస్రో (ISRO)శాస్ర్తవేత్తలు. చంద్రయాన్ -3 చంద్రుడికి మరింత చేరువైంది. ఇప్పుడు చంద్రునికి(Moon) ఈ అంతరిక్ష నౌక కేవలం 1437 కి.మీల కంటే తక్కువ దూరంలో ఉంది.
ఆగస్టు 14న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య చంద్రుడి చుట్టూ తన కక్ష్యను తగ్గించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రకటించింది. జూలై 14, 2023న శ్రీహరికోటలోని సతీష్ ధావన్(Sathish Dhavan) అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ని నిర్వహించే లక్ష్యం దిశగా క్రమంగా పురోగమిస్తోంది.అంతరిక్ష నౌక ప్రస్తుతం చంద్రుని నుండి 1,437 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ రాబోయే ఆపరేషన్ దానిని గణనీయంగా దగ్గరగా తీసుకెళ్లనుంది. సాఫ్ట్ ల్యాండింగ్ లో ప్రధానంగా మూడు క్లిష్టమైన దశలున్నాయి. భూ కక్ష్యలో ప్రయాణం, ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్, చంద్రుని కక్ష్యలో ప్రయాణం.. ఈ దశలు పూర్తయిన తర్వాత ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోతుంది. చంద్రునికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 23న సాయంత్రం 5.47 నిమిషాలకు చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ కానుంది.