ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా ఉన్న సమయం లో ఉమామహేశ్వరరావు అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు నీరుగార్చిన ఉమామహేశ్వరరావు నిందితులపై చర్యలు తీసుకోవాలంటే 10లక్షల లంచం ఇవ్వాలని వేధించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లంచం ఇవ్వకుంటే తమపై రివర్స్ కేసులు పెట్టి టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు. ఉమామహేశ్వరరావు తనను బూటు కాలితో తన్ని వేధించాడని ఓ బాధితుడు ఏసీపీకి ఫిర్యాదు చేశాడు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరి చారు. ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5వ తేదీ వరకు ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఉమామహేశ్వ రరావు కుటుంసభ్యులు, బంధువులు నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ లో దాదాపు 14 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఉమామహేశ్వరరా వు ఆగడాల గురించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. బాధితులు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. ఫిర్యాదు లన్నీ పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేశారు. 3 కోట్ల 45లక్షల ప్రాపర్టీని సీజ్ చేశారు.
ఆయన అత్తగారి ఇంట్లో 38లక్షల నగదు గుర్తించారు. ఆయన ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ప్రాపర్టీస్ సీజ్ చేశారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 50 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోసారి ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు. ఉమమహేశ్వర రావు ఇంట్లో దొరికిన ట్యాబ్ లో ఆయన లావాదేవీలు, ఎక్కడెక్కడ బిజినెస్ చేశారు? ఎక్కడెక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేశారు? ఈ డిటైల్స్ మొత్తం తెలిసే అవకాశం ఉందన్నారు. ఒక డైరీలో ఉమామహేశ్వరరావు కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఆ వ్యక్తులు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. అలాగే ఎవరెవరిని బెదిరించారు? ఎంత వసూలు చేశారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.


