ఆ సేతు హిమాచలం మన భారత దేశం.. భిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. ప్రధానంగా కులం, మతం అనేవి మన దేశంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల అవే అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఎన్నికల సమయాల్లోనైతే వీటి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 30న పోలింగ్ ఉండడంతో ప్రధాన పార్టీలే కాదు..ఓ మోస్తరు ఓటు బ్యాంకు ఉన్న పార్టీలన్నీ ప్రజల ఓట్లను గంపగుత్తగా ఎలా సొంతం చేసుకోవాలి అన్న దానిపై కొద్ది రోజుల ముందు నుంచే దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఎప్పటి మాదిరిగానే తెరపైకి వచ్చినవే కుల సంఘాలు, మత సంఘాలు.
వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని.. కుల, మత ప్రాతిపదికన విభజించడం సరికాదని అందరూ చెబుతుంటారు. రాజకీయ నాయకులైతే ఏ వేదిక ఎక్కినా కుల, మత రాజకీయాలు పోవాలని, ఎవరూ చేయొద్దని గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి అవేవీ ఉండవు. ఇంకా చెప్పాలంటే వాళ్ల రాజకీయమే ప్రధానంగా వాటి చుట్టూ తిరుగుతుంటుంది.
ప్రస్తుతం తెలంగాణలో కుల సంఘాలకు, ఆయా సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. పగలంతా ప్రచార పర్వంలో బిజీబిజీగా ఉంటున్న నేతలు రాత్రయిదంటే చాలు తమ నియోజకవర్గంలోని కులసంఘాలతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఇది చాటుమాటుగా సాగినా ఇప్పుడు ఇది దాదాపు బహిరంగంగానే జరుగుతోందన్న వ్యాఖ్యలు మామూలుగానే విన్పిస్తున్నాయి. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మీ కులపోళ్లంతా ఓటు వేయాలంటే మీకేం కావాలి చెప్పండంటూ కోరుతున్నాయి ఆయా పార్టీలు. పైగా ఇది కార్తీక మాసం కూడా కావడంతో వనభోజనాల పేరుతోనూ కుల, మత రాజకీయం చేస్తున్నారు మన నేతలు.
రెడ్డి, కమ్మ, బలిజ, గంగపుత్ర, రజక, నాయి బ్రాహ్మణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇలా ఎవరన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ కుల సంఘాలతో మరికొన్ని చోట్ల మత సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీ ఓటు మాకే అంటూ పెద్దల ముందు వాగ్దానాలు తీసుకుంటున్నారు. హామీ ఇచ్చినట్లుగా వాళ్ల ఓట్లన్నీ తమకే పడేలా గట్టిగా మాట తీసుకుంటున్నారు.
ఇందుకోసం పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లుతున్నాయి ఆయా పార్టీలు, వాటి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఆయా సంఘాలు కోరినట్లు వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామనడం, వారి కులాల పేరుతో అధికారంలోకి వచ్చాక భవనాలు నిర్మించడం, పార్కుల ఏర్పాటు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలా హామీలు ఉన్నాయనే చెప్పాలి. ప్రత్యేకించి మహానగరం హైదరాబాద్లో రాత్రయిందంటే చాలు ఎక్కడికక్కడ కులసంఘాలు, ఆయా మత పెద్దల మధ్య హామీలు తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయన్నది ఆయా పార్టీల నేతలే చెబుతున్నారు. కేవలం ఇక్కడే కాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్.. అన్నిచోట్లా ఇదే తంతు.
అన్ని పార్టీలు ఎన్నికల వేళ కుల, మత సంఘాల పేరుతో ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఓట్లను గంపగుత్తగా దండుకునే ప్రయత్నం చేస్తున్నారు సరే..మరి.. సంఘాలు చెప్పినంత మాత్రాన ఓటర్లంతా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా లేక మరోటా అన్నది త్వరలోనే తేలిపోనుంది.