BRS in Maharashtra | మహారాష్ట్ర లో బీఆర్ఎస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతుంది. నాందేడ్, కాందార్ లోహ వంటి సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలుకోని మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. రోజురోజుకు మహారాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ విస్తరిస్తూ.. మరాట ప్రజల హృదయాల్లో పాగావేసుకొంటున్నది. జాతీయస్థాయిలో అధినేత సిఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నదనడానికి మహారాష్ట్రలో జరుగుతున్న చేరికలు నిదర్శనంగా చెప్పొచ్చు. మహారాష్ట్రలోని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యం త్వరలోనే సాకారం అవ్వడానికి అడుగులు పడుతున్నాయి.
తాజాగా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆదివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువాలు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిలో మాజీ ఎమ్మెల్యే అన్నా సాహెబ్ మానె, సంతోష్ మానె, ప్రశాంత్ పాటిల్ ఉన్నారు. ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ శివసేన లీడర్, రెండు సార్లు ఎంఎల్ఏ గా పని చేసిన సీనియర్ నేత అన్నా సాహెబ్ మానె బీఆర్ఎస్ లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారికి గులాబీ కండువా కప్పి అధినేత కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు, గంగాపూర్ నియోజక వర్గానికి చెందిన సంతోష్ కుమార్, ఔరంగాబాద్ ఎన్సిపి యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ పాటిల్ కూడా నేడు బిఆర్ఎస్ లో చేరారు. సంతోష్ కుమార్ ఎన్సిపి పార్టీ తరపున గంగాపూర్ నుంచి పోటీ చేయగా… ఆయన 82 వేల ఓట్లు సాధించారు. ఆదివారం బిఆర్ఎస్ లో చేరిన నేతలు ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా పట్టు, ప్రజల్లో ఆదరణవున్న నేతలు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.