తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లే లక్ష్యంగా బీజేపీ ఉత్సాహంగా ముందుకె ళ్తోంది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ల కంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. ఎన్నికల సన్నద్ధతలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అన్నిస్థాయిల్లోని నాయకులు, కార్యకర్తల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ఎక్కువ ఓట్లు సాధించేలా చేయడాన్ని టార్గెట్గా పెట్టుకున్నాయి. ఈ క్రమంలో టిఫిన్ బైఠక్లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యాచరణతో నేతలు ముందుకు వెళ్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతులతో తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ ఇంటికి కనీసం మూడుసార్లు వెళ్లేలా ‘హర్ ఘర్ తీన్ బార్’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.
రాష్ట్రంలో రెండు దశల్లో ప్రచారంతో ఎలక్షన్ మేనేజ్మెంట్ వైపు బీజేపీ అడుగులు వేస్తోంది. తొలిదశలో నామినేషన్ల పర్వం ముగిసే వరకు రాష్ట్ర ముఖ్యనేతలు మొదలు సామాన్య కార్యకర్త వరకు అనుసరించాల్సిన రూట్మ్యాప్ను ప్రకటించింది. రెండోదశలో పోలింగ్ ముగిసేదాకా పోలింగ్ బూత్ స్థాయిలో చేపట్టాల్సిన ఎలక్షన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది.రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. అన్నిచోట్లా పక్కా ప్లానింగ్తో ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.
ఈ నెలాఖరులోగా ప్రతి లోక్సభ నియోజకవ ర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్కు ఇంకా నెలన్నరకుపైగా సమయం ఉండటంతో భారీ బహిరంగ సభల కంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న సభలు నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.రాష్ట్రంలో మిగతా పార్టీల కంటే ముందే తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేయనుండటం… స్వయంగా ప్రధాని మోదీ, ఇతర జాతీయ నేతలు ప్రచార సభల్లో పాల్గొ ననుండటం బీజేపీకి కలసి వస్తుందని ఆ పార్టీ ముఖ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.


