స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడేనని సీబీఐ తేల్చింది. ఇప్పటివరకు సహ నిందితుడిగా పేర్కొంటున్న సీబీఐ.. తాజాగా కోర్టుకు అందజేసిన నివేదికలో అవినాశ్ను ఏ8 నిందితుడిగా పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ సందర్భంగా దాఖలు చేసిన కౌంటర్లో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో తండ్రికుమారుల ప్రమేయం ఉందనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డి నిరంతరం ప్రయత్నిస్తున్నారని వివరించింది.
వివేకా హత్య జగన్కు ముందే తెలుసు: సీబీఐ
హత్య జరిగిన అనంతరం శివశంకర్రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోనే అవినాష్రెడ్డి హత్యాస్థలికి చేరారని.. ఉదయం 5.20కి ముందే అవినాష్రెడ్డి, శివశంకర్రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. అలాగే వివేకా హత్య విషయం సీఎం జగన్కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ పునరుద్ఘాటించింది. వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్కు తెలుసని దర్యాప్తులో గుర్తించామని సీబీఐ పేర్కొంది. ఈ దశలో భాస్కర్రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని స్పష్టం చేసింది.
భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దు: సునీత
మరోవైపు భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని, భాస్కర్రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. భాస్కర్రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలను సునీత ఈ సందర్భంగా ప్రస్తావించారు.