మహారాష్ట్రలో కొన్ని రోజుల కిందట జరిగిన సర్పంచ్ సంతోష్ హత్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సర్పంచ్ సంతోష్ హత్యతో పౌర సరఫరాల మంత్రి ధనుంజయ్ ముండేకు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ధనుంజయ్ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
మహారాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య నేపథ్యంలో ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంతోష్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ హత్య బీడ్ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కాగా సంతోష్ హత్యతో మంత్రి ధనుంజయ్ ముండేకు సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వరకు వెళ్లాయి. దీంతో ధనుంజయ్ మండేను రాజీనామా చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ధనుంజయ్ ముండే, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ధనుంజయ్ ముండే రాజీనామాను ఆమోదించి గవర్నర్ రాధాకృష్ణన్ కు పంపినట్లు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెల్లడించారు.
ఏం జరిగింది?
డిసెంబర్ 9న, మహారాష్ట్రలోని బీడ్ గ్రామానికి చెందిన సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ను కిడ్నాప్ చేసి, గంటల తరబడి హింసించడంతో చనిపోయాడు. అతని హత్య తర్వాత జరిగిన దర్యాప్తులో రాడ్తో కొట్టి, చెప్పలేని విధంగా హింసించి చంపేశారని తేలింది. దాదాపు మూడు నెలల తర్వాత, రాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే ప్రధాన అనుచరుడి ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న విండ్మిల్ ఎనర్జీ సంస్థను లక్ష్యంగా చేసుకుని జరిగిన దోపిడీ ప్రయత్నాన్ని ఆపడానికి సంతోష్ దేశ్ముఖ్ ప్రయత్నించాడని , అతని హత్యకు ప్రధాన సూత్రధారి మంత్రి ధనుంజయ్ ముండే సహాయకుడు వాల్మిక్ కరాడ్ అని దర్యాప్తులో తేలింది.
అజిత్ పవార్ అసంతృప్తి
ఇదిలా ఉంటే ధనుంజయ్ ముండే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత. బీడ్ జిల్లా మసాజోగ్ సర్పంచ్ సంతోష్ హత్య జరిగిన తరువాత ధనుంజయ్ ముండే రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ధనుంజయ్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎదురుదాడి చేశారు. కాగా ధనుంజయ్ ముండేకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అజిత్ పవార్ కు సామాజిక కార్యకర్త అంజలి దమానియా అందచేశారు. ఈ నేపథ్యంలో ధనుంజయ్ ముండే రాజీనామా చేయాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ డిమాండ్ ను ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత సుప్రియా సూలే కూడా బలపరిచారు. ఈ నేపథ్యంలో ధనుంజయ్ ముండే ఎపిసోడ్, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదిలా ఉందని ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ భావించారు. అంతిమంగా మంత్రి ధనుంజయ్ ముందే రాజీనామా చేశారు.
కొన్ని నెలల కిందట జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది. మహాయుతి కూటమిలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో అజిత్ పవార్ గ్రూప్ కోటా కింద ధనుంజయ్ ముండేకు మంత్రి పదవి దక్కింది. అయితే ధనుంజయ ముండేను రాజీనామా చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కోరడంపై అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ధనుంజయ్ ముండే రాజీనామా ఎపిసోడ్ రానున్న రోజుల్లో రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.