బెంగళూరు రేవ్ పార్టీ సినీ ఇండస్ట్రీనేకాదు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తాజాగా విజయవాడలో రేవ్ పార్టీ మూలాలు బయటపడ్డాయి. రేవ్ పార్టీకి ప్రధాన నిందితుడు వాసు అలియాస్ లంకపల్లి వాసు విజయవాడ వాసి. కొత్త పేటలోని ఆంజనేయవాడకు చెందిన వాసు హైదరాబాద్, బెంగళూరు నుంచి క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తుంటాడు. విజయవాడలోనూ అతిపెద్ద బుకీల నెట్ వర్క్ ను విస్తరించాడు వాసు. బర్త్ డే సందర్భంగా వాసు స్వయంగా బెంగ ళూరులోని ఫామ్ హౌస్ పార్టీని ఏర్పాటు చేయగా విజయవాడకు చెందిన నలుగురు ప్రధాన బుకీలు మిగిలిన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే మకాం వేసిన వాసు అక్కడి నుంచే మొత్తం వ్యవహారం నడిపించినట్లుగా తెలుస్తోంది.
బెంగళూరు రేవ్ పార్టీ పై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. పార్టీ నిర్వాహకులు లంకపల్లి వాసు విజయవాడ వాసిగా గుర్తించిన పోలీసులు.. అతనికి చాలా మంది సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలతో పరిచయం ఉందని గుర్తించారు. ప్రతి సంవత్సరం వాసు పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. క్రికెట్ బెట్టింగులను సైతం వాసు నిర్వహించేవాడు. ఐపీఎల్ సీజన్ లో కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని, దీంతో సెలబ్రెటీలతో, రాజకీయ నేతలతో పార్టీకి వాసు ప్లాన్ చేసినట్లు తెలిసింది. గత ఆదివారం బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో వాసు రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడు. పోలీసులు దాడులు చేసి రేవ్ పార్టీలో డ్రగ్స్ సీజ్ చేశారు. రేవ్ పార్టీకి వచ్చిన వారి వద్ద నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని FSL కు పంపించారు. డ్రగ్స్ పెడ్లర్స్ తో వాసుకున్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సినీనటి హేమ కూడా ఈ రేవ్ పార్టీ లో ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ హేమ బుకాయిస్తున్నారు. ఈ మేరకు తాను ఇంట్లోనే ఉన్నట్లు పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. మరోవైపు రక్త పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలితే వారిపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


