స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలోని అన్ని పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్న నేపథ్యంలో.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. దీనిప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. మొత్తం 88 సెలవులు వచ్చాయి.
ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్ను క్రీడలకు ఆప్షనల్గా పేర్కొన్నారు. ఇక ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్ చెప్పాలని విద్యాశాఖ సూచించింది. ఒకటి, రెండు తరగతులకు మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలని క్యాలెండర్లో పేర్కొన్నారు.
ఇక సెలవుల విషయానికి వస్తే.. దసరా సెలవులు అక్టోబరు 14 నుంచి 24 వరకు ఇస్తారు. నవంబరు 12న దీపావళి, డిసెంబరు 25న క్రిస్మస్, సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు ఉండనున్నాయి. క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 21 నుంచి 24 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు.
ఫార్మాటివ్-1(సీబీఏ) పరీక్షలు 1-9 తరగతులకు ఆగస్టు 1-4, ఫార్మాటివ్-2 అక్టోబరు 3 – 6 వరకు నిర్వహిస్తారు. సమ్మేటివ్-1 పరీక్షలు నవంబరు 4 – 10 వరకు, ఫార్మాటివ్-3 (సీబీఏ) జనవరి 3 – 6 మధ్య, ఫార్మాటివ్-4 పరీక్షలను ఫిబ్రవరి 23-27 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29, సమ్మేటివ్-2, సీబీఏ-3 పరీక్షలు ఏప్రిల్ 11-20 వరకు నిర్వహిస్తారు.