ఏపీలో పోలింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నామినేషన్ల పర్వం కూడా పీక్ స్టేజ్కు చేరడంతో మండు వేసవిలో ఏపీ రాజకీయం సెగలు కక్కుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పొలిటికల్ తెరపైకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అంతేనా రాజకీయాలకు దూరం అంటూనే పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం మంచి పరిణామం అని తెలిపారు. వారికి ఓటేయాలని చిరు పిలుపునివ్వడంతో సజ్జల సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతివ్వటంలో తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదన్నారు. ఏపీ పొలిటికల్ తెర మీద జగన్ ఒక్కరు ఒకవైపు ఉన్నారని.. మరోవైపు గుంటనక్కలు, తోడేళ్లు అందరూ ఉన్నారంటూ సజ్జల కామెంట్స్ చేశారు. చిరంజీవిని పరోక్షంగా వైఫల్య నేతగా అభివర్ణించారు.
చిరంజీవిపై సజ్జల చేసిన వ్యాఖ్యలకు పవన్ ఓ రేంజ్లో సీరియస్ అయ్యారు. చిరంజీవి అజాత శత్రువని.. ఆయన జోలికొస్తే సహించేది లేదంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు. రాష్ట్రప్రజల జోలికి, చిరంజీవి జోలికి, బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాలంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సింహం కాదు.. గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్ అని విమర్శించారు. సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అధికార విపక్షాల మధ్య రచ్చకు కారణం అవుతున్నాయి.
చిరంజీవి పిఠాపురం పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించు కున్నాయి. సజ్జల చిరంజీవిని టార్గెట్ చేసుకోవడంతో పవన్ కూడా ఘాటుగానే స్పందించారు. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి పిలుపుతో మెగా అభిమానులు కూటమి పార్టీల వెంట నడుస్తారనే అంచనాలున్నాయి. పలు ప్రాంతాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నట్లు గ్రౌండ్ రిపోర్ట్ కూడా అందుతున్నట్లు సమాచారం. అందుకే వైసీపీ నేతల తమపై మాటల దాడి చేస్తున్నారని జనసేన నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ పొలిటికల్ తెరపైకి చిరంజీవి ఎంటర్ అవడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.