ఏపీలో అధికార కూటమి, సీఎం చంద్రబాబుపై మాజీసీఎం జగన్ విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంత వరకు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టలేదని అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ప్రచారం చేశారని.. 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీగా మారిందని ఆరోపించారు. ఎన్నిక మేనిఫెస్టోలో 143 హామీలను పెట్టి.. ఇంటింటికీ ప్రచారం చేయించారు. అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని ప్రశ్నించమని అన్నారు.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలో చెప్పాలని నిలదీశారు. సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేశారు. నీకు రూ.15వేలు, నీకు రూ,.15వేలు అంటూ ప్రచారం చేశారని విమర్శించారు.
బట్టన్ నొక్కడం పెద్ద పనా అని అన్నారు. ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ మాపై విమర్శలు చేశారు. 9 నెలల కాలంలోనే అప్పుల్లో రికార్డులు బద్దలు కొట్టారని అన్నారు. బడ్జెటరీ అప్పులే 9 నెలల్లో 80వేల 827 కోట్లు చేశారని అన్నారు. అమరావతి పేరు చెప్పి.. తెచ్చిన, తేబోతున్న అప్పులు కలిపి మరో రూ.52 వేల కోట్లు ఉన్నాయి. అంతా కలిపితే లక్షా 40వేల కోట్ల పైబడే ఉన్నాయి.. కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిందని చెప్పారా..? ఇన్ని అప్పులు చేసి సూపర్ సిక్స్ అమలు చేశారా.. అంటూ నిలదీశారు వైఎస్ జగన్.
కనీసం తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలైనా కొనసాగించారా.. అంటే అదీ లేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా 2 లక్షల మంది వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పారు. బ్రెవరేజ్ కార్పొరేషన్లో మరో 18వేల మంది ఉద్యోగాలు కూడా పోయాయని చెప్పారు.
“ఏపీని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు మేం విజన్తో పనిచేశాం. 4 పోర్టుల నిర్మాణం మా హయాంలో ప్రారంభమైంది. రామాయపట్నం పోర్ట్ 75 శాతం పూర్తైంది. ఎన్నికల కోడ్ రాకపోయి ఉంటే రామాయపట్నానికి షిప్ కూడా వచ్చేది. మూలపేట, మచిలీపట్నం పనులు కూడా వేగంగా జరిగాయి. భవిష్యత్తులో ఈ పోర్టుల విలువ కొన్ని లక్షల కోట్లు. పోర్టులను ఇప్పుడు అమ్మకానికి పెట్టారు.
చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే తన ఆస్తులు పెంచుకోవడం.. తన బంధువుల ఆస్తులను పెంచడం. ఇది మాత్రమే సంపద సృష్టి. రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఇసుకతో గతంలో ప్రభుత్వానికి సంవత్సారానికి రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. ఇసుక నుంచి ఇప్పుడు ఒక్క పైసా ఆదాయం రావడం లేదు. ధర మాత్రం మా ప్రభుత్వం హయాంలో అమ్మిన ధర కన్నా డబుల్ రేటుకి అమ్ముతున్నారు.
ప్రభుత్వ రంగంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటీకరించారు. ఇదే ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ను జైలులో పెట్టారు. ఇక్కడ సక్సెస్ అయింది. అక్కడ చేయలేకపోయారు. అందుకే ఆయన జైలుకు వెళ్లారు. చంద్రబాబు తన అనుచరులకు షాపులను కేటాయించారు దుకాణాలు పొందిన వారు మన కళ్ల ముందే ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు.గవర్నమెంట్ ఆధీనంలో ఉండి ఉంటే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చేది కదా..రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది.. చంద్రబాబు నాయుడు ఆదాయం పెరుగుతోంది.
చంద్రబాబును నమ్మొద్దని ఎన్నికల సమయంలో చెప్పా. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడం..చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే అని చెప్పా. ప్రజలు పొరపాటున ఓటేసి చంద్రముఖిని నిద్రలేపారు. తన అబద్ధాలను ఓ పద్ధతి ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్తారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ పేరుతోనూ డ్రామాలు ఆడారు. ఐదేళ్ల పాలన కాకుండా కేవలం ఒక్క ఏడాదినే పోల్చి వక్రీకరించారు. చంద్రబాబుని ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. నటనలో ఏదైనా అవార్డు ఇవ్వాలంటే ఎన్టీఆర్కి కాదు…చంద్రబాబుకి ఇవ్వాలి.”.. అని జగన్ అన్నారు.