స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయింది. అయితే.. బస్సు వేగంగా వెళ్తుండటంతో అదుపు తప్పి, పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయాలైన వారిని వెంటనే దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బందితో పాటు ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని ముఖ్యమంత్రికి తెలియజేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైదన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారుల్ని ఆదేశించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. అలాగే.. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు.