అన్నాచెల్లెళ్లు అన్యోన్యతకు మారుపేరు అంటారు పెద్దలు. సహజంగా బయటి ప్రపంచంలో చాలా చోట్ల అలాగే ఉంటారు. సిస్టర్ సెంటిమెంట్కు ఫిదా అవుతుంటారు బ్రదర్స్. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో హాట్టాపిక్ అయ్యారు.అప్పటికే ఆయన కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా ఉన్నారు. అయితే తండ్రి రాజశేఖర రెడ్డి మరణవార్త విని గుండెపోటుతో చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి.అయితే ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్బై కొట్టారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో తండ్రి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి స్థాపించారు. స్వంత పార్టీ ఏర్పాటులో సోదరి వైఎస్ షర్మిల ప్రమేయం కూడా ఉందంటారు రాజకీయ విశ్లేషకులు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ దశలో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగేసి నడిచారు షర్మిల. పార్టీ కార్యకలాపాల్లో జగన్మోహన్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్న సమయంలో ఆయన అరెస్టు కు గురయ్యారు. దీంతో సోదరి వైఎస్ షర్మిల వెంటనే రంగంలోకి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. జనంలో పార్టీని నిలబెట్టడానికి పాదయాత్ర కూడా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున షర్మిల ప్రచారం నిర్వహించారు. అంతిమంగా 2019 ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అయ్యారు. అయితే ఇదంతా గతం. సీన్ కట్ చేస్తే….ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిల రాజకీయ ప్రత్యర్థి. ఏ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి స్వంత పార్టీ పెట్టుకున్నారో… అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ పగ్గాలు చేపట్టారు వైఎస్ షర్మిల. అన్నాచెల్లెళ్లు ప్రస్తుతం వేర్వేరు రాజకీయ శిబిరాల్లో ఉన్నారు.
కథ ఇక్కడితో ఆగలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ఎడా పెడా విమర్శలు కురిపిస్తున్నారు వైఎస్ షర్మిల. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లల విషయంలో ఇది రుజువైంది. ఒకప్పుడు అన్నకు తోడుగా నిలిచిన చెల్లెలు ఇవాళ రాజకీయ ప్రత్యర్థిగా మారారు. దటీజ్ పాలిటిక్స్ అంటున్నారు రాజకీయ పండితులు.


