Kakinada: తెలుగుదేశం పార్టీ నేత, ప్రతిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల రాజా(Varupula raja) అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. ఆయన భౌతికకాయానికి వైసీపీ నేతలు ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. గతంలో వరుపుల రాజా వైసీపీలో పనిచేశారని, తమతో కలుపుగోలుగా ఉండేవారని ఈ సందర్భంగా కన్నబాబు గుర్తుచేసున్నారు. ఆయన మరణవార్త తమను దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. రాజా మరణం పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారని.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారని కన్నబాబు తెలిపారు.
అలాగే టీడీపీ ముఖ్య నేతలు కూడా రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం రాత్రి 7గంటల సమయంలో గుండెనొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పడంతో హుటాహుటిన కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
కాగా 1976 ఆగస్టు 14న జన్మించిన రాజా బీకామ్ వరకు చదువుకున్నారు. రాజకీయాలపై ఆసక్తితో 2004లో రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత డీసీసీబీ చైర్మన్గా, ఆప్కాబ్వైస్ ఛైర్మన్గా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.