విశాఖ సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. డ్రగ్స్ కంటైనర్ను విశాఖ పోర్టులోనే ఉంచారు. సీబీఐ ప్రత్యేక అధికారుల బృందం విశాఖలోనే మకాం వేశారు. కంటైనర్లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో డ్రైడ్ ఈస్ట్ను స్వాధీనం చేసుకుని శాంపిల్స్ ల్యాబ్స్కు పంపించారు. 49 నమూనాల్లో 27 శాంపిల్స్లో డ్రగ్స్ గుర్తించారు. ఒక్కో బ్యాగ్లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయనే లెక్క తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా ఒకటి రెండు రోజుల్లో నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది.
సంధ్యా ఆక్వా బస్సులో రికార్డులపై సీబీఐ దృష్టి సారించింది. మరోవైపు మూడు రోజులుగా కాకినాడ కొత్తమూలపేట సెజ్లో సంధ్యా ఆక్వా బస్సు పార్క్ చేసి ఉంది. కొత్తపల్లి ఎస్సై స్వామి నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ ను పిలిపించి బస్సులో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులు కంప్యూటర్ సామాగ్రి ఉన్నట్టు గుర్తించామని ఎస్సై తెలిపారు. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో గత మూడు రోజులుగా సెజ్ కాలనీలో డ్రైవర్ బస్సు నిలిపివేశారని వివరణ ఇచ్చారు. బస్సులో డ్రగ్స్ ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎస్ఐ ఖండించారు.
ఇదిలా ఉండగా గత మూడు రోజుల క్రితం సిబిఐ విశాఖలో 25 వేల కిలోల డ్రై ఈస్ట్ లో మిక్స్ చేసిన డ్రగ్స్ నమూనాలను గుర్తించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సంధ్య ఆక్వా పరిశ్రమ బ్రాంచీలపై తనిఖీలు చేపట్టింది. మూలపేట, శంఖవరం ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలలో పలు రికార్డులను సిబిఐ తనిఖీలు చేసి వివరాలను నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా మూలపేట సెజ్ కాలనీలో బస్సు నిలిచిపోయి ఉండడం, కంప్యూటర్ సామాగ్రి, కంపెనీ రికార్డులు బస్సులో ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. మొదటగా కంపెనీ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు స్పందించలేదని, పోలీసులు వచ్చిన తర్వాత మాత్రమే సిబ్బంది వచ్చారని అంటున్నారు.
మూడు రోజుల క్రితం బస్సు బ్రేక్ డౌన్ కావడంతో సేజ్ కాలనీలో నిలిచిపోయిందని కొత్తపల్లి ఎస్సై స్వామి నాయుడు వివరించారు. అయితే బస్సు లో డ్రగ్స్ ఉన్నట్టు ప్రచారం జరగడంతో తనిఖీలు చేపట్టి అందులో ఏం లేదని.. కేవలం రికార్డులు మాత్రమే ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా బ్రేక్ డౌన్ అయిన బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టిన వెంటనే కంపెనీ సిబ్బంది వచ్చి బస్సును హుటాహుటిన స్టార్ట్ చేసి తరలించకపోవడం చూస్తుంటే బ్రేక్ డౌన్ ఎప్పుడు జరిగింది. బ్రేక్ డౌన్ జరిగితే పోలీసులు స్పందించిన వెంటనే ఎలా స్టార్ట్ అయిందనే దానిపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై సిబిఐ లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని ఆధారాలు దొరుకుతాయని స్థానికులు అంటున్నారు.