నవీన్ పట్నాయక్కు ఒడిశా ప్రజలు షాకిచ్చారు. దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు. అభివృద్ది కోసం కమలం పార్టీకి జై కొట్టారు. దీంతో ఆరోసారి ముఖ్య మంత్రి కావాలన్న నవీన్ పట్నాయక్ ఆశలు ఆవిరయ్యాయి.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికి పట్టం కట్టారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ ఓటమికి చేరులో ఉంది. భారతీయ జనతా పార్టీ గెలుపు తీరాలకు దగ్గరగా ఉంది.ఒడిశా పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరచాయి. గత పాతికేళ్లుగా నవీన్ పట్నాయక్ అధికారంలో కొనసాగినా, అభివృద్ధి అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు పెల్లుబుకాయి. పాతికేళ్ల కిందట ఒడిశా ఎలా ఉందో ఇప్పటికీ ఒడిశా అలాగే ఉంది. కేంద్రంలో పోట్లాడి తెచ్చుకున్న ప్రాజెక్టులు అంటూ ఏమీ లేవు. అనేక రంగాల్లో ఒడిశా వెనుకబడింది. ప్రజల తలసరి ఆదాయం కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో అభివృద్దే తాజా ఒడిశా ఎన్నికల్లో కీలకాంశంగా మారింది.
నవీన్ పట్నాయక్ చిన్నా చితకా నాయకుడు కాదు. బిజూ పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఒడిశా రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ అంచెలంచెలుగా ఎదిగారు. 2000 సంవత్సరం మార్చి ఐదో తేదీన తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నవీన్ పట్నాయక్. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన. ప్రస్తుతం ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బిజూ జనతాదళ్ గెలిస్తే నవీన్ పట్నాయక్ ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవారు. అయితే నవీన్ పట్నాయక్ ఆశలపై నీళ్లు చల్లారు ఒడిశా ప్రజలు. దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ను పక్కన పెట్టారు. అభివృద్ది చేస్తామంటూ ముందుకు వచ్చిన భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు.
వ్యక్తిగతంగా నవీన్ పట్నాయక్ నిజాయితీ పరుడు. పాతికేళ్లుగా ముఖ్యమంత్రి గా ఉన్నా అవినీతి మరక అంటని రాజకీయవేత్త. అయితే అభివృద్ది అంశాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈసారి తమకు అధికారం ఇస్తే ఒడిశాను దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రాన్ని చేస్తామన్నారు. నరేంద్ర మోడీ మాటను ఒడిశా ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. మోడీ మాటలతో ఆలోచనలో పడ్డారు. తమకు వారసత్వ రాజకీయాల కంటే అభివృద్దే ముఖ్యమన్నారు. కమలం పార్టీకి జై కొట్టారు. ఏమైనా ఒడిశా ప్రజల అభివృద్ధి ఆకాంక్ష గెలిచింది.


