కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. కమలదళం నాయకత్వం లోని ఎన్డీయే కూటమి 350కిపైగా సీట్లు దక్కించుకో వడం ఖాయమని మెజారిటీ సంస్థలు తేల్చి చెప్పాయి. అంతేకాదు.భారతీయ జనతా పార్టీని కుర్చీ నుంచి దించేయడానికి ఏర్పడ్డ ఇండియా కూటమి తన లక్ష్య సాధనలో విజయవంతం కాబోదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అధికార కూటమికి దూరంగా 150 సీట్లకు కాస్త అటూఇటూగా ఇండియా కూటమి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి.
మనదేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 272. కిందటిసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకుంది. మొత్తంగా ఎన్డీయే కూటమి 353 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ 53 సీట్లకే పరిమితమైంది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏదే అధికారమని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. ఎన్డీయే కూటమి తక్కువలో తక్కువగా 281 సీట్లు, అత్యధికంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అయోధ్య అంశం, ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ ఎన్డీయే కూటమి గెలుపునకు ప్రధాన కారణాలని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఇక ఇండియా కూటమికి 118 నుంచి 154 సీట్ల వరకు దక్కవచ్చు.
అబ్ కీ బార్ చార్ సౌ అనే నినాదంతో ఈసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగింది ఎన్డీయే కూటమి. 400 సీట్లు వచ్చినా, రాకపోయినా, సదరు సంఖ్యకు దగ్గరగా ఎన్డీయే కూటమి వెళుతుందని మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాగా ఎన్డీయే కూటమి 400 మార్కును అందుకోగలదని టుడేస్ చాణక్య, ఇండియా టీవీ – సీఎన్ ఎక్స్ అంచనా వేశాయి. అలాగే కమలం పార్టీ స్వంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. ఈసారి బీజేపీ 306 నుంచి 315 సీట్లు గెలుచుకుంటుందని టుడేస్ చాణక్య, న్యూస్ 18 సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కమలదళం 322 నుంచి 340 వరకు సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
ఈసారి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అనేక సంస్థలు అంచనా వేశాయి. బెంగాల్లోని మొత్తం 42 సీట్లలో బీజేపీ 23 చోట్ల విజయం సాధిస్తుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సంస్థ జోస్యం చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమవుతుందని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అలాగే మెజారిటీ సంస్థల అంచనాల ప్రకారం తమిళనాడు, కేరళ లో ఈ సారి బీజేపీ ఖాతా తెరవడం ఖాయం. అదే సమయంలో కర్ణాటకలో ఈసారి బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే కిందటిసారి ఎన్నికలతో పోలిస్తే బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇక మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ సీట్లలో బీజేపీ అనుకూల మహాయుతి కూటమి కనీసం 28 సీట్లు గెలుచుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి.
కేంద్రంలో మరోసారి ఎన్డీఏదే అధికారమని తేల్చాయి ఎగ్జిట్ పోల్స్. ఎన్డీయే కూటమి తక్కువలో తక్కువగా 281 సీట్లు, అత్యధికంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చాయి. ఇక, ఇండియా కూటమికి 118 నుంచి 154 సీట్ల వరకు దక్కవచ్చని లెక్కలేశాయి.రిపబ్లిక్-పీమార్క్ ఎగ్జిట్పోల్ ప్రకారం ఎన్డీఏకు 359 సీట్లు దక్కవచ్చు. ఇండియా కూటమికి 154 ఎంపీ స్థానాలు, ఇతరులకు మరో 30 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. కాగా రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు 353 నుంచి 368 ఎంపీ సీట్లు వస్తాయి. ఇండియా కూటమికి 118 నుంచి 133 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇతరులకు 43 నుంచి 48 లోక్సభ సీట్లు వస్తాయని లెక్కలేసింది. జన్కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే కూటమికి 362 నుంచి 392 స్థానాలు వస్తాయి. ఇండియా కూటమికి 141 నుంచి 161 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇతరులకు పది నుంచి ఇరవై ఎంపీ స్థానాలు రావచ్చన్న జన్కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్లోనూ ఎన్డీఏ కూటమికే అవకాశాలున్నాయి. ఈసారి ఎన్డీయే కూటమికి 281 నుంచి 350 సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇండియా కూటమికి 145 నుంచి 201 సీట్ల మధ్య రావచ్చని అంచనాలు వచ్చాయి. ఇతరులకు 33 నుంచి 49 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తంగా చూస్తే కమలనాథులు చెప్పినట్లుగా 400 మార్క్ చేరకపోయినా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ మ్యాజిక్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో పనిచేసిందన్న మాట గట్టిగా విన్పిస్తోంది.