33.5 C
Hyderabad
Wednesday, March 11, 2026
spot_img

ఏపీ రాజధాని రగడకు ముగింపు ఎప్పుడు ?

     ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మొదటి నుంచీ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిగా ఏ పట్టణం, నగరం ఉండాలన్న దానిపై మొదలైన రగడ… మూడు రాజధానుల వరకు కొనసాగుతూనే ఉంది. అయితే.. ఏపీ కేపిటల్‌గా అమరావతికి.. విపక్షంలో ఉన్నప్పుడు ఓకే చెప్పిన వైసీపీ.. ఆ తర్వాత మాట మార్చడం ఈ మొత్తం వ్యవహారంలో చాలా ప్రధానమై నది. అక్కడ నుంచి మొదలైన రగడ… గందరగోళం.. ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరి స్థితి.

      ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అందరిలో విన్పించిన మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని. దీనిపైనే శివరామకృష్ణ కమిటీ అప్పట్లోనే కీలక సిఫార్సులు చేసింది. ఏపీలో అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదని తేల్చింది. రాజధానిని వికేంద్రీకరించాలని సూచించింది. ప్రభుత్వ వ్యవస్థలను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని పేర్కొంది. మరీ ముఖ్యంగా రాజధాని ఏర్పాటు సమయంలో సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా కేపిటల్ నిర్మించాలని సూచించింది. అయితే..ఈ సిఫార్సులను పక్కన పెట్టి అమరావతిని రాజధానిగా ఖరారు చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. ఇందుకు తగ్గట్లుగానే విజయవాడ సమీపంలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ నాడు ఏపీ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ సైతం రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చింది. అయితే.. ల్యాండ్ పూలింగ్ సహా ఇతర విషయాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించింది వైసీపీ. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున పుస్తకాలను సైతం ప్రచురించింది. అయితే.. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ అధినేత జగన్. అమరావతి నిర్మాణానికి, రాజధానికి అన్ని విధాలా మద్దతు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మాత్రం సీన్ రివర్సైంది. రాజధానిగా అమరావతి విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకుందనే చెప్పాలి.

      ఎవరూ ఊహించని విధంగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రకటన చేశారు సీఎం జగన్. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులపై మాట్లాడిన ముఖ్యమంత్రి… పరిపాలనా వికేంద్రీకరణే తమ విధానమని చెప్పారు. దీంతో.. ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే… సీఎం ప్రకటన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా 2020 జనవరిలో CRDA రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదించారు. అయితే.. శాసనమండలిలో హైడ్రామాతో బిల్లు పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మళ్లీ అసెంబ్లీ ఆమోదంతో… మండలి ఆమోదం లేకుండానే బిల్లు పాసయింది. చివరకు గవర్నర్ ఆమోదంతో 2020 సెప్టెంబర్‌లో మూడు రాజధానుల చట్టం రూపొం దించారు.

       ఓవైపు విపక్షాలేమో అమరావతే రాజధానిగా ఉండాలని అంటాయి.. అధికార పక్షం మూడు రాజధానులని చెబు తుంది. దీంతో.. పోటాపోటీ నిరసనలు, దీక్షలు, కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో రైతులు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దీంతో.. న్యాయపరంగా మూడు రాజధానుల అంశానికి చిక్కులు మొదలయ్యాయి. ఫలితంగా.. ముందుకు వెళ్లడం జగన్‌ ప్రభుత్వానికి కష్టంగా మారింది. చివరకు ఏపీ హైకోర్టులో కేసు విచారణలోనే ఉండగా.. తుది తీర్పు వెలువడే ముందు.. 2022 మార్చినెలలో తాము చేసిన రెండు చట్టాలను ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ పేరుతో చేసిన రెండు చట్టాలను జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ఆ తర్వాత తీర్పు వెలువరించిన హైకోర్టు… రాజధానులను మార్చే విషయంలో శాసనసభకు అధికారం లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ కాలపరిమితి సైతం విధించింది. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ సర్కారు. కానీ, దీనిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది.

       ఓవైపు రాజధాని వ్యవహారం అంతా ప్రస్తుతం న్యాయస్థానాల చేతిలో ఉన్న వేళ.. ఎందుకీ గందరగోళం అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అయితే.. చట్టం పరిధిలో ఉన్న అంశంపై అందుకు లోబడే వ్యవహరిస్తున్నట్లు చెబుతు న్నారు వైసీపీ నేతలు. అయితే.. ఈ వ్యవహారంలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు విపక్ష నేతలు. మొదట్లో మూడు రాజధానులని చెప్పిన అధికార పక్షం.. చివరకు ఒక్క రాజధాని కూడా కట్టకపోవడం వల్లే రకరకాల మాటలు చెబుతోందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఎన్నికల్లో ఈ అంశాన్ని మరుగున పరిచేందుకే వైసీపీ నేతలు భిన్నమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అంటున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్