తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోసారి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె ల్యే ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. దీనికితోడు వ్యక్తిగత విమర్శలు చేసుకొని.. దమ్ము ధైర్యం ఉంటే సవాల్ కు రావాలని ఇరువురు సవాళ్లు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గం పరిధిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకిదిగి భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన 500కోట్ల అవినీతిని నిరూపిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్డెక్కారు. పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు.
గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే చేసిన అవినీతిపై కరపత్రాలువేసి అనపర్తి లో డోర్ టూ డోర్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంచారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే గొడవ చేయడానికి వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు ఎమ్మెల్యే అనుచరులు వెళ్లారు. ఈ ఘటనపై కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. తాను లేన ప్పుడు ఇంటికి రావడం కాదు.. ఎప్పుడు వస్తావో చెప్పి అప్పుడు రా.. తాను సిద్ధంగా ఉంటాను అంటూ మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే.. ఇవాళ ఉదయం 10గంటలకు వస్తానని ప్రతి సవాల్ చేశాడు. దీంతో మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సవాళ్లకు అనపర్తి వేదికైంది.ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తన ఇంటివద్ద ఇవాళ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదే సమావేశం వద్దకు వచ్చి ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపిస్తానంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడంతో శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో బిక్కవోలు వినాయకుడు సాక్షిగా సత్య ప్రమాణాలకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.


