ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? వైసీపీ మరోసారి విజయం సాధించి రెండోసారి అధి కారంలోకి వస్తుందా లేక టీడీపీ-జనసేన కూటమి విక్టరీ కొడుతుందా ? దీనిపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది ? అసలు వైసీపీ పాలన విషయంలో జనం నాడి ఏంటి ? టీడీపీ-జనసేన కూటమి విషయంలో ప్రజల అభిప్రాయం ఏంటి ? ఇలా ఓటర్ల నాడి తెలుసుకునే అంశంపై స్వతంత్ర టీవీ సర్వే నిర్వహించింది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో గెలిచేది ఎవరంటూ స్వతంత్ర టీవీ జరిపిన ప్రజాభిప్రాయంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
ఏదో ఒకటీ అరా రోజు సర్వే జరిపి చేతులు దులుపుకోలేదు స్వతంత్ర టీవీ. ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించింది. ఈ ఆరు రోజుల పాటు జరిగిన సర్వేలో లక్షా యాబై ఎనిమిది వేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొంద రు… పరిస్థితి ఒక పార్టీకి అనుకూలమంటే మరికొందరు మరో కూటమిదే అధికారమని చెప్పారు. విజయావకాశాలు సగం సగం అన్న వారూ ఉన్నారు. ఆరు రోజుల పాటు స్వతంత్ర టీవీ జరిపిన సర్వేలో 67 శాతం మంది రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ-జనసేన కూటమిదే అంటూ పట్టం కట్టారు. ఐదేళ్ల అధికార వైసీపీ పాలనపై సామాన్యుల నుంచి మధ్య తరగతి వరకు ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. తద్వారా.. 2024 ఎన్నికల్లో తమ ఓటు టీడీపీ – జనసేన కూటమికేనని పరోక్షంగా తేల్చిచెప్పారు.
మొదటి రోజు జరిపిన సర్వేలో మొత్తం 21 వేల మంది వరకు పాల్గొన్నారు. తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటూ అనుకూలంగా 30 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయగా… టీడీపీ-జనసేన కూటమిదే పవర్ అంటూ 67 శాతం మంది చెప్పారు. అటు అధికార, ఇటు విపక్ష కూటమి విజయావకాశాలు చెరో సగం అంటూ నాలుగు శాతం మంది చెప్పుకొచ్చారు.
రెండో రోజు చేపట్టిన సతంత్ర టీవీ సర్వేలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. కాకపోతే ఈసారి 28 వేల మంది తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇందులో వైసీపీకి విజయావకాశాలు కేవలం 29 శాతం మాత్రమేనని… అదే టీడీపీ- జనసేన కూటమికి 66 శాతం గెలుపు అవకాశాలున్నాయని ప్రకటించారు. ఇక, విజయం సగం సగం అన్న వారి శాతం నాలుగుకు పరిమితమైంది.
ఇక, మూడో రోజు స్వతంత్ర టీవీ సర్వేలో 28 శాతం మంది పాల్గొన్నారు. ఇందులో టీడీపీ జనసేన కూట మిదే విక్టరీ అంటూ 66 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించగా.. 30 శాతం మంది వైసీపీదే అన్నారు. ఇక, విజయావకాశాలు చెరో సగం అన్న వారు నాలుగు శాతం మంది.
నాలుగో రోజు సర్వేలో 25 వేల మంది తమ అభిప్రాయం చెప్పారు. ఇందులోనూ టీడీపీ జనసేన కూటమిదే ఏపీలో అధికారం అంటూ 67 శాతం మంది చెప్పగా… కేవలం 30 శాతం మంది మాత్రమే వైసీపీకే విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. గెలుపు అవకాశాలు ఇరు పార్టీలకు చెరో సగం అంటూ చెప్పుకొచ్చిన వారి శాతం కేవలం 3 మాతమే.
ఇక, ఐదో రోజు చేపట్టిన సర్వేలో ఈసారి 27 వేల మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో వైసీపీదే మరోసారి అధికారమని 30 శాతం మంది చెప్పగా… 67 శాతం మంది మాత్రం టీడీపీ -జనసేన కూటమి వైపు మొగ్గు చూపారు. విజయావకాశాలు చెరి సగం అన్న వారి శాతం మూడు.ఆరో రోజు స్వతంత్ర టీవీ చేపట్టిన సర్వేలోనూ గెలుపు అవకాశాలు టీడీపీ-జనసేన కూటమిదేనని వెల్లడయింది. 29 వేల మంది ఆరో రోజు సర్వేలో పాల్గొనగా అందులో 67 శాతం మంది టీడీపీ-జనసేన కూటమిదే 2024 ఎన్నికల్లో గెలుపని చెప్పారు. వైసీపీ వైపు మొగ్గు చూపిన వారి శాతం కేవలం 30 మాత్రమే. ఇక, విజయా వకాశాలు ఇద్దరికీ సమానమంటూ చెప్పుకొచ్చిన వారు మూడు శాతం మంది. మొత్తంగా చూస్తే ఆరు రోజులపాటు స్వతంత్ర టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో… రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమిదే విజయం అని తేలింది. అధికార వైసీపీకి పరాజయం తప్పదని తేల్చిచెప్పారు ప్రజలు.


